హైదరాబాద్: ఎప్పటిలానే ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేసవిలో సందడి చేయనుంది. ఇటీవల 14వ ఎడిషన్కు సంబంధించిన ఆటగాళ్ల వేలం కూడా ముగిసింది. అయితే టోర్నీ వేదికలు మాత్రం ఖరారు కాలేదు. టోర్నీ వేదికల గురించి భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) చర్చలు నిర్వహిస్తున్నట్లు తాజాగా సమాచారం తెలుస్తోంది. ఈ సారి పలు నగరాల్లో మ్యాచ్లను చేపట్టాలని బీసీసీఐ భావిస్తున్నదట. దీని గురించి బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్లో ఐపీఎల్ 2020 మ్యాచ్లను నిర్వహించలేదన్న విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లో 13వ ఎడిషన్ ఐపీఎల్ను దుబాయ్ వేదికగా నిర్వహించారు. అక్కడి మూడు నగరాల్లో బయోబుల్ వాతావరణం సృష్టించి టోర్నీ నిర్వహించారు. అయితే ఈసారి ఇంకా కొంత సమయం ఉన్న నేపథ్యంలో భారత్లో ఎక్కడెక్కడ టోర్నీలు నిర్వహించాలన్న కోణంలో బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒక నగరం కాకుండా.. మరికొన్ని వేదికల్లో మ్యాచ్లను నిర్వహించాలని భావిస్తున్నారు.
కనీసం నాలుగైదు నగరాలను ఐపీఎల్ 2021 మ్యాచ్లకు వేదికలుగా నిర్ణయించే అవకాశం ఉందని తాజాగా సమాచారం తెలుస్తోంది. ముంబై, కోల్కతా, హైదరాబాద్తో పాటు చెన్నై నగరాల్లోనూ ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. ఇదే నిజమయితే హైదరాబాద్ అభిమానులకు పండగే. ఇక దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగియగా.. విజయ్ హరారే ఆ దిశగా సాగుతోంది. దీంతో భారత్లోనే టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్ను కేవలం ఒకే నగరానికి పరిమితం చేయనున్నారని కూడా ఇదివరకు వార్తలు వచ్చాయి. వేర్వేరు నగరాల్లో బయోబబుల్ వాతావరణం ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా క్రికెటర్లు ఒకటి రెండు రోజులకే బయోబబుల్ వదిలి వెళ్లడం కూడా కుదరదు. అందుకే ఒకే నగరంలో నిర్వహిస్తే బయోబబుల్ ఏర్పాటు ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా, ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఒకే నగరంలో ఐపీఎల్ నిర్వహిస్తామంటే ఫ్రాంచైజీలు ఒప్పుకునే అవకాశం లేదు. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'