
హైదరాబాద్: హైదరాబాద్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడికి బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా గత వారం విశాఖపట్నం వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో అంపైర్ నిర్ణయంతో విభేదించడంపై వివరణ ఇవ్వాలని బోర్డు రాయుడిని ఆదేశించింది.
ఈ మేరకు హైదరాబాద్ జట్టు మేనేజర్ కృష్ణారావుకు కూడా బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం లోగా వివరణ ఇవ్వాలని కోరింది. గతవారం కర్ణాటక-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అంఫైర్ల పొరపాటు కారణంగా జరిగిన ఓ ఘటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో అంపైర్ తప్పిదం వల్ల గందరగోళం నెలకొంది.
అసలేం జరిగింది?
కర్నాటక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండో ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో కరుణ్ నాయర్ మిడ్ వికెట్ వైపు ఆడి రెండు పరుగులు చేశాడు. అయితే బంతిని ఆపే క్రమంలో మెహిదీ హాసన్ కాలు బౌండరీ లైన్ రోప్ను తాకినట్టు స్పష్టమైంది. దీనిని ఫీల్డ్ అంపైర్లు గమనించలేదు. దీంతో రెండు పరుగులు మాత్రమే ఇచ్చారు.

ఇన్నింగ్స్ ముగిశాక హైదరాబాద్ 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఆట ఆరంభానికి ముందు కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కర్ణాటక జట్టు స్కోరులో మరో రెండు పరుగులు జత చేసి స్కోరును 205/5గా మార్చారు.
ఈ విషయం హైదరాబాద్ బ్యాట్స్మెన్కు ఆట మధ్యలో తెలిసింది. దాంతో కెప్టెన్ అంబటి రాయుడు అంపైర్లతో వాదనకు దిగాడు. మరోవైపు వినయ్ కుమార్ కూడా మైదానంలోకి వచ్చి అంపైర్లతో చర్చించాడు. అయితే హైదరాబాద్ వాదనను పట్టించుకోని అంపైర్లు ఆటను కొనసాగించారు.
చివరకు హైదరాబాద్ కూడా సరిగ్గా 203 పరుగులే చేయడంతో ఆ పరుగుల ప్రాధాన్యం పెరిగింది. కర్ణాటకకు రెండు పరుగులు అదనంగా కలపక పోయి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. ఆ రెండు పరుగులు కర్ణాటకకు అదనంగా కలిపిన తీరుపై అభ్యంతరం వ్యక్తం జేస్తూ.. సూపర్ ఓవర్ ఆడించమని కోరగా...అంపైర్లు అంగీకరించకుండా కర్ణాటకను విజేతగా ప్రకటించారు.
మ్యాచ్ ముగిశాక కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానం వీడకపోవడంతో తర్వాత జరగాల్సిన ఆంధ్ర, కేరళ మ్యాచ్ ఆలస్యమై చివరకు 13 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ జట్టు కెప్టెన్ అంబటి రాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'నాకు నిబంధనల గురించి బాగా తెలుసు. అప్పుడే అంపైర్లు ఫోర్గా ప్రకటిస్తే సమస్య ఉండకపోయేది. మాకు లక్ష్యం నిర్దేశించాక రెండు పరుగులు ఎలా కలుపుతారు. ఒక సారి బ్యాట్స్మన్ అవుటై పెవిలియన్ చేరాక అది నాటౌట్గా తేలినా, అది నో బాల్ అయినా మళ్లీ వెనక్కి పిలవరు కదా. మొత్తంగా ఏం జరిగిందో తెలియదు. మేమైతే 204 పరుగులు లక్ష్యంగానే బరిలోకి దిగాం. ఇదే విషయాన్ని చెప్పి సూపర్ ఓవర్కోసం మేం వేచిచూశాం. కానీ వారు ఆ ఓవర్ను ఆడించలేదు' అని రాయుడు తెలిపాడు. ఈ మొత్తం వివాదంపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ అంబటి రాయుడికి తాజాగా నోటీసులు జారీ చేసింది.