
హైదరాబాద్: భారత క్రికెటర్లు ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యమిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, క్రికెటర్లు డీఎన్ఏ పరీక్షకు హాజరవుతున్నారు. ఫిట్నెస్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని నిర్ణయించుకున్న బోర్డు, ఇందులో భాగంగా భారత ఆటగాళ్లందరికీ డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తోంది.
ఈ డీఎన్ఏ టెస్టుతో ప్రతి క్రికెటర్ జన్యు సంబంధ ఫిట్నెస్ వివరాలు తెలుస్తాయి. ఓ ఆటగాడు తన వేగాన్ని, కండలను పెంచుకోవడానికి.. కొవ్వును కరిగించుకోవడంతో పాటు... కోలుకునే సమయం గురించి మరింత స్పష్టత వచ్చేందుకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం భారత జట్టులో సభ్యుడైన ఆటగాడి శరీరంలో 23 శాతానికి మించి కొవ్వు ఉండరాదు. జనెటిక్ ఫిట్నెస్ టెస్టుగా కూడా పిలుచుకునే ఈ పరీక్షతో క్రికెట్ శరీరానికి సంబంధించి 40 రకాల జీన్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. జట్టు ట్రైనర్ శంకర్ బసు సూచన మేరకు బీసీసీఐ ఈ కొత్త పరీక్షను ప్రవేశపెట్టింది.
దీనిని నిర్ధారించిన బీసీసీఐ అధికారి ఒకరు ఈ పరీక్ష కోసం ఒక్కో ఆటగాడికి గరిష్టంగా రూ.30 వేలు అవసరమవుతుందని, అది పెద్ద మొత్తమేమీ కాదని చెప్పారు. ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్లలో కూడా డీఎన్ఏ టెస్టు అమల్లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
'అవును. భారత క్రికెటర్లకు కొంతకాలంగా డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నాం. జట్టు మేనేజ్మెంట్ నిర్దేశించిన ఫిట్నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఆటగాళ్లకు డీఎన్ఏ పరీక్షనును తొలిసారి ఎన్బీఏలో ప్రవేశపెట్టారు. భారత క్రికెట్లోనూ దీన్ని ప్రవేశపెట్టాలన్నది శంకర్ బసు ఆలోచన'' అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి చెప్పారు.