హైదరాబాద్: బీసీసీఐకి ఎన్నికలు అక్టోబర్ 22న జరగనున్నాయి. సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సంస్కరణలు అమలు చేసేందుకు సుప్రీం కోర్టు 2017 జనవరిలో ఐదుగురు సభ్యులతో సీఓఏని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా బీసీసీఐ కార్యకలాపాలను సీఓఏనే చూసుకుంటుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ నరసింహతో విస్తృత చర్చల తర్వాత సీఓఏ ఈ నిర్ణయం ప్రకటించింది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సభ్యులతో బీసీసీఐ బోర్డు నిర్వహణ జరుగుందన్న నమ్మకాన్ని అమికస్ క్యూరి పీఎస్ నర్సింహా కమిటీ వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో చర్చించి ఆయన తన నివేదికను సమర్పించారు.
రాష్ట్ర సంఘాల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు పూర్తిచేయాలని పేర్కొన్నారు. లోధా సిఫార్సులను 30 రాష్ట్ర సంఘాలు అమలు చేశాయని, మిగతావి తమ రాజ్యంగాలను మారుస్తున్నాయని వినోద్ రాయ్ వెల్లడించారు. బీసీసీఐకి ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
"సుప్రీం కోర్టు మమ్మల్ని నియమించినప్పుడు నా పాత్ర నైట్ వాచ్మన్ లాంటిదని చెప్పా. కానీ ఈ నైట్ వాచ్మన్ చాలా ఎక్కువ రోజులే ఉన్నాడు. మాకు అప్పగించిన పని ప్రత్యేకమైంది. బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు కొత్త రాజ్యంగాన్ని ఆమోదించడం తప్పనిసరి. సీఓఏతో, అమికస్ క్యూరితో బోర్డు సభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి వారికి బాధ్యతలు అప్పటిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని వినోద్ రాయ్ అన్నారు.
కాగా, స్పాట్ ఫిక్సింగ్ ఆరోణపలతో బీసీసీఐ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు గాను సుప్రీం కోర్టు సీఓఏ పేరిట పాలకుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీకి ప్రస్తుతం వినోద్ రాయ్ చీఫ్గా ఉండగా.. డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ జనరల్ రవి తోగ్డేలు సభ్యులుగా ఉన్నారు.