హైదరాబాద్: భారత జట్టు క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే విషయంలో ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా)దే తుది నిర్ణయమని క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ అన్నారు. జాతీయ క్రీడా సమాఖ్య(ఎన్ఎస్ఎఫ్) పరిధిలోకి తాము రాని కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) తమ క్రికెటర్లకు పరీక్షలు జరిపే హక్కు లేదంటూ బీసీసీఐ ఇది వరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీ హాఫ్ మారథాన్లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'భారత్లోని అన్ని క్రీడా సంఘాలు జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా)పై నమ్మకం ఉంచాలి. క్రికెటర్లను డోపింగ్ పరిధిలోకి తీసుకొస్తారా లేదా అనేది వాడాకు వదిలేస్తున్నాం. వాడాలో ఐసీసీకి సభ్యత్వం ఉంటే ఫర్వాలేదు' అని అన్నారు.
'అయితే క్రికెటర్లకు డోప్ పరీక్షలు చేయాలా.. వద్దా అనేది వాడా నిర్ణయించాలి. ఆటగాళ్లు, కోచ్లు, అభిమానులు ఈ ముగ్గురు మాకు చాలా ప్రాధాన్యం కల్గిన వాళ్లు. అలాంటి ప్రతి క్రీడలో పారదర్శకత అనేది అవసరం. అందుకే ప్రతి సంస్థలోనూ డోపింగ్ లేకుండా చూసుకోవాలి. దానికి క్రికెట్ అనేది అతీతం కాదు' అని రాధోడ్ తెలిపారు.
చివరగా, వాడా పరిధిలోకి ఐసీసీ క్రికెటర్లను తీసుకొస్తే తమ ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదని ఆయన తేల్చి చెప్పారు. భారత క్రికెటర్లకు డోప్ టెస్టులు నిర్వహించే హక్కు నాడాకు లేదని బీసీసీఐ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇటీవలే బీసీసీఐ అనేది నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) కాదని, ప్రస్తుతం తాము అనుసరిస్తున్న యాంటీ డోపింగ్ వ్యవస్థ సమర్థవంతంగా ఉందని నాడాకు రాసిన లేఖలో బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి పేర్కొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.