వినోద్ రాయ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
పాలకుల కమిటీ, ఆఫీస్ బేరర్లతో సంప్రదించి తీసుకున్న నిర్ణయాల్లో విరాట్ కోహ్లిని కౌంటీ క్రికెట్లోకి అనుమతించటమేనని బీసీసీఐ బోర్డు వర్గాలు అంటున్నాయి. మిగతా వాటిలో మెజార్టీ నిర్ణయాలను పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారని ఆఫీస్ బేరర్ల నుంచి వస్తున్న తీవ్ర ఆరోపణ. ఇందుకు బలం చేకూర్చుతున్నట్టుగా ఇటీవల బీసీసీఐ నియామకం ఒకటి చోటుచేసుకున్నది.
ఏకపక్షంగా పాలక కమిటీ నిర్ణయం తీసుకున్నదని ఆరోపణలు
రాజస్థాన్ మాజీ డీజీపీ అజిత్ సింగ్ను బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్గా నియమిస్తూ పాలకుల కమిటీ ప్రకటన చేసింది. దీనిపై ఆఫీస్ బేరర్లను సంప్రదించలేదని తెలుస్తోంది. కానీ పాలకుల కమిటీ, లోధా సిఫారసుల ప్రకారం బోర్డు ఉద్యోగులు 60 ఏళ్ల వయసొచ్చాక ఉద్యోగ విరమణ చేయాలి. ఆఫీస్ బేరర్లకు ఇది 70 ఏళ్లు. కానీ ప్రస్తుతం ఏసీయూ చీఫ్గా ఎంపికైన అజిత్ సింగ్ వయసు 61. ఆయనకు ముందు ఏసీయూ చీఫ్ గా పని చేసిన నీరజ్ కుమార్ ను ఐపీఎల్ నేపథ్యంలో వచ్చేనెలాఖరు వరకు కొనసాగించాలని బీసీసీఐ పాలక మండలి నిర్ణయించింది.
అమితాబ్ కొనసాగింపునకు లభించని అనుమతి
ఇదే సమయంలో భారత క్రికెట్కు మూడు దశాబ్దాలుగా సేవలందిస్తోన్న ప్రొ. రత్నాకర్ శెట్టికి మరో మూడు నెలలు పొడగింపు లభించ లేదు. అమితాబ్ చౌదరి కొనసాగింపు కోసం లేఖ రాసినా వయసు నిబంధన సాకుతో పాలకుల కమిటీ పక్కనపెట్టింది. ఇదే సమయంలో అజిత్ సింగ్ను 61 ఏళ్ల వయసులో నియమించింది. పాలకుల కమిటీ నిబంధనలు వ్యక్తులను బట్టి మారుతు న్నాయని ఈ ఉదంతంతోనే తెలుస్తోందని ఆఫీస్ బేరర్లు విమర్శిస్తున్నారు.
1985 నుంచి ముంబై.. 1996 నుంచి బీసీసీఐలో రత్నాకర్ సేవలు
ఇక రత్నాకర్ శెట్టి ముంబై క్రికెట్లో 1985 నుంచి పని చేస్తున్నారు. 1996 నుంచి బీసీసీఐలోనే కొనసాగుతున్నారు. మార్చి 31తో రత్నాకర్ శెట్టి పదవీ విరమణ రోజు. ఈ విషయం బీసీసీఐలోని ఎవ్వరికీ తెలియకపోగా, సుదీర్ఘ కెరీర్లో కనీస వీడ్కోలు లేకుండా రత్నాకర్ శెట్టి ఆఫీస్ వదిలి వెళ్లటంపై బోర్డు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.