
రెండేళ్ల క్రితమే అజహర్ విజ్ఞప్తి:
బీసీసీఐ బోర్డు నిబంధనల ప్రకారం మాజీ ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పెన్షన్, ఇతర సౌకర్యాలతో కలిపి అజహరుద్దీన్కు రూ. కోటిన్నర రావాల్సి ఉంది. అయితే.. అజహర్పై మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించిన నిషేధం కొనసాగుతుండటంతో పెన్షన్ను బోర్డు నిలిపివేసింది. 2012లోనే ఏపీ హైకోర్టు అజహర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తన బాకీలు చెల్లించాలంటూ రెండేళ్ల క్రితమే అజహర్ విజ్ఞప్తి చేశారు.

త్వరలోనే పెన్షన్:
అయితే అజహర్ విజ్ఞప్తిని అప్పటి సీఓఏ మాత్రం స్పందించలేదు. బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ పగ్గాలు చేపట్టేవరకు కూడా బీసీసీఐకి ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దాదా అధ్యక్షుడు అయ్యాక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తొలి కెప్టెన్కు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. దాదా నిర్ణయంతో త్వరలో అజహరుద్దీన్కు పెన్షన్, ఇతర సౌకర్యాల డబ్బులు దక్కనున్నాయి.

అజరుద్దీన్ స్టాండ్:
ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా అజహరుద్దీన్ ఎన్నికయిన విషయం తెలిసిందే. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అజహరుద్దీన్ పేరిట ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ పెవిలియన్కు ఆయన పేరు పెట్టేందుకు అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ నెల 6న భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్ సమయంలో అధికారికంగా స్టాండ్కు పేరు పెడతామని హెచ్సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ తెలిపారు.

99 టెస్టులు, 334 వన్డేలు:
తొలి టీ20 మ్యాచ్కు ముందు 'అజరుద్దీన్ స్టాండ్' కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు హెచ్సీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరుకానున్నారు. గంగూలీతో పాటు బీసీసీఐ బోర్డు ఇతర పెద్దలు, మాజీ క్రికెటర్లు కూడా హాజరవుతారని సమాచారం తెలుస్తోంది. అజరుద్దీన్ భారత క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా స్టాండ్ను ఏర్పాటు చేస్తున్నారు. అజహర్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.


Click it and Unblock the Notifications
