హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అఫీషియల్ అంపైర్ పార్ట్నర్గా వ్యవహరించే అవకాశాన్ని పేటీఎం దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. వచ్చే ఐదేళ్లపాటు పేటీఎంతో ఈ ఒప్పందం కొనసాగుతుందని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు.
'ప్రస్తుతం పేటీఎం టీమిండియా టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అలాగే ఐపీఎల్తో కూడా బంధం కొనసాగించేందుకు ఒప్పందం కుదిరింది. పేటీఎం, బీసీసీఐ రెండు సత్సంబంధాలు కొనసాగుతాయి. దీని ద్వారా బీసీసీఐతో పాటు పేటీఎం కూడా లాభపడుతుంది' అని ఆయన పేర్కొన్నారు.
అనంతరం పేటీఎం ఫౌండర్, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఐపీఎల్లో భాగస్వాములవడం సంతోషంగా ఉంది. పేటిఎం ఎదుగుదలలో క్రికెట్ ఓ కీలక పాత్ర పోషించింది. మాకు బీసీసీఐతో మంచి సంబంధాలు ఉన్నాయి" అని ఆయన అన్నారు.
"అతితక్కువ కాలంలోనే తమకు ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఈ ఏడాది ఐపీఎల్లో మా పెట్టుబడులు మా నిబద్ధతను మరింత బలపరుస్తుంది అని భావిస్తున్నా'' అని ఆయన తెలిపారు. కాగా, గత సీజన్ కోసం వివో సంస్థ రూ.100 కోట్లతో టైటిల్ స్పాన్సర్షిప్ను దక్కించుకుంది.
అంతకమందు డిఎల్ఎఫ్, పెప్సీకో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఏప్రిల్ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది.
మొత్తం 51 రోజులు పాటు జరిగే ఈ టోర్నీకి 9 వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. మే 27న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వాంఖడె వేదికగా జరుగుతుంది.