
హైదరాబాద్: బీసీసీఐ కార్యవర్గ సభ్యులకు, సుప్రీంకోర్టు నియమించిన పరిపాలకుల కమిటీ (సీఓఏ) మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. సీఓఏ (పరిపాలకుల కమిటీ) చీఫ్ వినోద్ రాయ్ అనుమతి లేకుండా బీసీసీఐ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. క్రికెట్ బోర్డ్ గేమ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ రత్నాకర్ శెట్టి పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగిస్తూ బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు పదవీ కాలం పొడిగింపు లేఖను బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మంగళవారం రత్నాకర్ శెట్టికి అందజేశాడు. ఐతే చీఫ్గా విధులు నిర్వహిస్తోన్న వినోద్ రాయ్ ఆమోదం లేకపోవడంతో ఈ నిర్ణయం చెల్లుబాటు ప్రశ్నార్థకంగా మారింది.
పరోక్ష ధోరణిలో స్పందించి:
సీఓఏ శెట్టి వ్యవహారంలో అమితాబ్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కానీ, బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) అధికారిగా వ్యవహరిస్తోన్న నీరజ్కుమార్కు మాత్రం 2 నెలలపాటు పొడిగింపునిచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన అమితాబ్.. ఏసీయూ కొత్త అధికారి అజిత్సింగ్ జారీ చేసిన నియామక పత్రంపై సంతకం చేయలేదు.
కానీ, సీఓఏ ఆదేశాలతో సీఈఓ రాహుల్ జోహ్రి.. అజిత్సింగ్ నియామకానికి ఆమోదముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో అమితాభ్ బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కోశాధికారి అనిరుధ్ చౌదరిలతో సంప్రదించాల్సి వచ్చింది.