ఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉంది. కానీ.. మ్యాచ్ షెడ్యూల్ చేయబడింది కాబట్టి ఆడక తప్పదు అని టీమిండియా భారత మాజీ ఓపెనర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో భారత్, బంగ్లాదేశ్ల మధ్య మొదటి టీ20 జరుగనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నగరాన్ని కాలుష్యం హడలెత్తిస్తున్నా.. షెడ్యూలు ప్రకారం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.
కేన్ విలియమ్సన్కు ఐసీసీ క్లీన్ చీట్!!
కాలుష్యం పంజా విసురుతున్నా తొలి టీ20 కోసం భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టీం ప్రాక్టీస్ సెషన్కు ముందు విక్రమ్ రాథోడ్ మీడియాతో మాట్లాడారు. 'నా క్రికెట్ కెరీర్ మొత్తం ఉత్తర భారతదేశంలోనే సాగింది. ఇక్కడి పరిస్థితులు నాకు తెలుసు. అవును ఇప్పుడు కూడా కాలుష్యం ఎక్కువగా ఉంది. మ్యాచ్ షెడ్యూల్ చేయబడింది కాబట్టి మేము ఆడితీరాల్సిందే' అని అన్నారు.
'ఆటగాడు ఒక్కసారి మైదానంలోకి దిగాక ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు. అయితే ఆరోగ్య సలహాలు కూడా తీసుకోవాలి. ఒక ఆట ఆడటానికి ఇక్కడ ఉంటే.. కచ్చితంగా ఆడాలి. మేము ఇప్పుడే వచ్చాం. ఇది మొదటి రోజు సాధన మాత్రమే. ఇంకా మేము కాంబినేషన్ల గురించి ఆలోచించలేదు. టీ20 చిన్న ఫార్మాట్ కాబట్టి ఆటగాళ్ళు మిస్ కారు' అని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు.
ఢిల్లీలో గురువారం ప్రాక్టీస్ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్లకు వాయు కాలుష్య సెగ తప్పలేదు. అక్కడ వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. తొలి మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్ మాస్క్లు ధరించి ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ సందర్భంగా లిటన్ దాస్ మాస్కు ధరించాడు. ఈ రోజు భారత జట్టు విక్రమ్ రాథోడ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేస్తోంది.
ఢిల్లీలో క్రికెటర్లు వాయు కాలుష్యం బారిన పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెటర్లు సైతం ఇబ్బందులు పడ్డారు. 2017లో కాలుష్యం తట్టుకోలేని కొంతమంది లంక క్రికెటర్లు వాంతులు చేసుకోగా.. మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. అది టెస్టు మ్యాచ్ కావడంతో లంక క్రికెటర్లు ఐదు రోజులు బాధను భరించారు. ఇప్పటివరకూ కూడా ఢిల్లీలో ఏమీ మార్పులు రాలేదు.