క్షమాపణ కోరుతున్నా..
విజయానంతరం తమ ఆటగాళ్లు కొంచెం అతిగా ప్రవర్తించారని, దురదృష్టవశాత్తు మైదానంలో చోటుచేసుకున్న ఘటనపట్ల చింతిస్తున్నానని బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ తెలిపాడు. తమ జట్టు తరఫున భారత్ ఆటగాళ్లను క్షమాపణలు కోరుతున్నానని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తమ వాళ్లు అలా ప్రవర్తించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లను ప్రత్యేక అభినందించాల్సిందని చెప్పుకొచ్చాడు. ‘మా బౌలర్లలో కొంత మంది ఉద్వేగంలో ఉన్నారు. విజయానంతరం మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తన అలా ఉండాల్సి కాదు. అసలు అక్కడేం జరిగిందో నాకు తెలియదు. దాని గురించి ఎవరిని అడగదలుచుకోలేదు.
ఫైనల్ అనగానే భావోద్వేగాలు ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. కొన్నిసార్లు ఆటగాళ్లు వాటిని అదుపు చేసుకోలేరు. కానీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకూడదు. ఏ స్థాయిలోనైనా ప్రత్యర్థి జట్టును గౌరవించాలి. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. కాబట్టి మా జట్టు తరఫున జరిగిన సంఘటనకు క్షమాపణలు చెబుతున్నా. భారత ఆటగాళ్లను ప్రత్యేకంగా అభినందించాలి. టోర్నీ ఆసాంతం వారు అద్భుతంగా ఆడారు.'అని అక్భర్ తెలిపాడు.
మా కల నిజమైంది..
ప్రపంచకప్ గెలుపుతో తమ కల నిజమైందని అక్బర్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘మా కల నిజమైంది. గత రెండేళ్లుగా మేం చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. నేను క్రీజులోకి వెళ్లిన సమయంలో మాకో మంచి భాగస్వామ్యం అవసరముంది. నా సహచరులకు అదే చెప్పా. ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే భారత్ అంత సులభంగా మమ్మల్ని గెలవనివ్వదనే విషయం మాకు తెలుసు. కఠినమైన ఛేదనే అయినా సాధించాం. కోచింగ్ బృందానికి ఎలా కృతజ్ఞత తెలపాలో కూడా అర్థం కావట్లేదు. మా విజయాన్ని కోరుకున్న వారందరికీ థ్యాంక్స్. ఇది మాకు ఆరంభం మాత్రమే. తర్వాత కూడా ఈ గెలుపు మాకు స్పూర్తిగా నిలుస్తుంది.'అని తెలిపాడు.
జైస్వాల్ ఒక్కడే..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్. 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (121 బంతుల్లో 88; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్ అవిషేక్ దాస్ 3 వికెట్లు తీశాడు. తర్వాత కప్ కొట్టేందుకు 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక బంగ్లాదేశ్ లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు. కెప్టెన్ అక్బర్ అలీ (77 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలబడి గెలిపించాడు. రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అక్బర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', యశస్వి జైస్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.