ఢాకా: న్యూజీలాండ్ లోని క్రైస్ట్ చర్చి మసీదు నరమేధాన్ని సృష్టించిన కాల్పుల ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు..స్వదేశానికి చేరుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువత 17 మంది సభ్యులు ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ రాజధాని ఢాకా చేరుకుంది. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి జహీద్ ఎహసాన్ రస్సెల్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజ్ముల్ హసన్, ఇతర అధికారులు వారికి ఢాకాలోని హజరత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రికెట్ జట్టు కేప్టెన్ మహమూద్ రియాద్ విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటికీ మాటలు రావట్లేదు: రియాద్
న్యూజీలాండ్ లో క్రైస్ట్ చర్చిలో మసీదులో ప్రార్థనలకు వెళ్లిన తాము తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని కేప్టెన్ తెలిపారు. ఈ ఘటనపై వర్ణించడానికి తనకు ఇప్పటికీ మాటలు రావట్లేదని అన్నారు. ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నామని చెప్పారు. అయిదే అయిదు నిమిషాల్లో తాము కాల్పుల నుంచి బయటపడ్డామని అన్నారు.
ప్రజలు, అభిమానుల ప్రార్థనల వల్లే తాము సురక్షితంగా స్వదేశానికి తిరిగి రాగలిగామని రియాద్ అన్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి చేర్చిన న్యూజీలాండ్ క్రికెట్ బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మృత్యువును అతి సమీపం నుంచి చూశామని, అదృష్టం బాగుండి బయట పడ్డామని అన్నారు. అయిదు నిమిషాలు ముందుగా తాము మసీదులోకి వెళ్లి ఉంటే.. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలను ఊహించడానికి భయంగా ఉందని రియాద్ చెప్పారు.