|
చరిత్ర పునరావృతం
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో సమన్వయ లోపంతో ఒకే వైపు భారత మహిళా బ్యాటర్లు పరుగెత్తుతూ రనౌట్ అయ్యారు. ఆ రనౌట్కు సంబందించిన ఫొటోని, ఇటీవలే ముగిసిన అండర్- 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ బ్యాట్స్మెన్ రనౌట్ అయ్యే ఫొటోని ఐసీసీ ట్వీటింది. 'చరిత్ర పునరావృతం అయింది' అని కాప్షన్ పెట్టింది. అంతేకాదు ఓ కళ్లు మూసుకున్న కోతి ఎమోజీని పోస్ట్ చేసింది.
|
ఐసీసీ పోస్టుకు బీసీబీ రీట్వీట్
ఐసీసీ పోస్టుకు బీసీబీ రీట్వీట్ చేసింది. 'మిమ్మల్ని ఓడించడానికి మాకు మరో అవకాశం ఇస్తున్నారు' అనే అర్థం వచ్చేలా బీసీబీ రాసుకొచ్చింది. మ్యాచ్లో భారత అమ్మాయిలు బ్యాటింగ్, బౌలింగ్లో రాణించి బంగ్లా అమ్మాయిల్ని 18 పరుగుల తేడాతో మట్టికరిపించారు. దీంతో బీసీబీ చేసిన ట్వీట్కు భారత అభిమానులు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. తమదైన స్టయిల్లో రెచ్చిపోతూ బీసీబీపై పంచ్ల వర్షం కురిపిస్తున్నారు.
మరో ఐదు ఏళ్లు ఎదురుచూడాలి
'భారత్పై గెలుపు కోసం మీరు మరో ఐదు ఏళ్లు ఎదురుచూడాలి' అని ఓ భారత అభిమాని కామెంట్ చేయగా... 'బంగ్లాదేశ్ ఆటగాళ్లే కాకుండా బీసీబీకి కూడా అత్యుత్సాహమే' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'బంగ్లా.. మీకు అంత సీన్ లేదు', 'అన్ని సార్లూ అలానే జరిగిపోదు', 'మీకు ఇలానే ఏదో రోజు జారుతుంది, తొందరెందుకు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
2016 టీ20 ప్రపంచకప్లోనూ ఇంతే
బంగ్లాదేశ్ ఆటగాళ్లు 2016 టీ20 ప్రపంచకప్లో మ్యాచ్ ముగియకముందే ధోనీసేనపై గెలిచినంత సంబరాలు చేసుకున్నారు. చివరికి బంగ్లా ఓడిపోయింది. దీంతో నెటిజన్లు బంగ్లా ఆటగాళ్లను సామాజిక మాధ్యమాల్లో ఓ ఆట ఆడేసుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మరోసారి అత్యుత్సాహం చూపించి నెటిజన్ల చేతిలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
షెఫాలీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'
సోమవారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై హర్మన్ప్రీత్ సేన 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. షెఫాలీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.