సహచర ఆటగాడిపై దాడి:
బంగ్లా నేషనల్ క్రికెట్లో భాగంగా ఢాకా డివిజన్, ఖుల్నా డివిజన్ మధ్య మ్యాచ్ జరిగింది. షహదత్ బౌలింగ్ చేసేందుకు రెడీ అవుతుండగా.. సహచర ఆటగాడు అరాఫత్ సన్నీ బంతిని ఒకవైపే రుద్దవద్దని సూచించాడు. బంతిని ఒకవైపే షైన్ చేయొద్దని చెప్పడంతో షహదత్ మండిపడ్డాడు. మైదానంలో అందరూ చూస్తుండగానే ఎందుకు షైన్ చేయకూడదంటూ ఆరాఫత్పై చేయి చేసుకున్నాడు. తోటి ఆటగాళ్లు అక్కడకి వచ్చే సరికి సన్నీని షహదాత్ పిడిగుద్దులు గుద్దాడు.
ఐదేళ్ల నిషేధం:
ఈ ఘటనను బంగ్లా బోర్డు సీరియస్గా పరిగణించింది. షహదత్ తన తప్పును మ్యాచ్ రిఫరీ ముందు అంగీకరించగా.. ఆ నివేదికను బంగ్లా టెక్నికల్ కమిటీకి పంపారు. దీనిపై విచారణ జరిపిన కమిటీ.. ఐదేళ్ల నిషేధంతో పాటు 3 లక్షల టాకాల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. షహదత్పై ఏడాది పాటు నిషేధం విధించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. అయితే అవన్ని తప్పుడు వార్తలు, అతనిపై ఐదేళ్ల నిషేధం విధించాం అని బోర్డు ప్రకటించింది.
నాతో గొడవకు దిగాడు:
నిషేధం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్ నుంచి షహదత్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఆరాఫత్ మాట్లాడుతూ... 'బంతిని ఒక వైపే మెరుపు చేయడం మంచి పద్ధతి కాదు. ఇదే విషయాన్ని షహదత్కు చెప్పా. అతను నాతో గొడవకు దిగాడు. ఆ సమయంలోనే నాపై చేయి చేసుకున్నాడు' అని తెలిపాడు.
2015లో చివరిసారి ఆడాడు:
బంగ్లా జట్టు తరఫున షహాదత్ 38 టెస్టులు, 51 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 153 వికెట్లు తీసాడు. 33 ఏళ్ల హుస్సేన్ 2015లో చివరిసారి బంగ్లా జాతీయ జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుండి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.