హరారే: జింబాబ్వే గడ్డపై బంగ్లాదేశ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ను చేజార్చుకున్న బంగ్లాదేశ్.. మూడు వన్డేల సిరీస్లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే స్టార్ సికిందర్ రాజా(109 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 135 నాటౌట్) శతక్కొట్టడంతో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 303 పరుగులు భారీ స్కోర్ చేసింది.
కెప్టెన్ తమీమ్ ఇక్బాల్(88 బంతుల్లో 9 ఫోర్లతో 62), ఓపెనర్ లిటన్(89 బంతుల్లో 9 ఫోర్లు సిక్స్తో 81), ఫస్ట్ డౌన్ బ్యాటర్ అనముల్ హక్(62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 73) హాఫ్ సెంచరీలతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో విక్టర్, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.
అనంతరం 304 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 48.2 ఓవర్లలో 5 వికెట్లకు 307 పరుగులు చేసి మరో నాలుగు బంతులుండగానే సునాయ విజయాన్నందుకుంది. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సికిందర్ రాజా.. ఇన్నోసెంట్ కై(110) సాయంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ సెంచరీలతో చెలరేగి బంగ్లా బౌలర్లను చెడుగుడు ఆడారు. ఇన్నోసెంట్తో కలిసి నాలుగో వికెట్కు 192 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన సికిందర్ రాజా.. కడవరకు క్రీజులో నిల్చొని విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ విధ్వంసకర బ్యాటింగ్తో సికిందర్ అరుదైన ఘనతను అందుకున్నాడు. చేజింగ్లో ఐదో స్థానం లేదా అంతకన్నా తక్కువ స్టానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరత్ర సృష్టించాడు. ఇక బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన రాజాకు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లామ్, మెహిదీ హసన్, హోస్సెన్ తలో వికెట్ తీసారు.