హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎన్నికల బరిలో పోటీకి సిద్ధమయ్యాడు. మంగళవారం హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజహరుద్దీన్ నామినేషన్ వేశాడు. నామినేషన్ అనంతరం అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడాడు. లోధా కమిటీ సిఫారసుల మేరకే తాను నామినేషన్ వేసినట్లు చెప్పుకొచ్చారు.
హెచ్సీఏలో తనకు ఓటు లేకపోయినా పోటీ చేసే హక్కు ఉందని పేర్కొన్నాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎన్నికల్లో తనకు గెలుస్తాననే నమ్మకం ఉందని చెప్పాడు. హెచ్సీఏ పూర్తిగా నగరానికే పరిమితమైందని చెప్పిన అజహర్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నైపుణ్యమున్న క్రీడాకారులున్నారని అన్నాడు.
అవసరమైతే తన గెలుపుకోసం హెచ్సీఏ సభ్యుడిగా ఉన్న మంత్రి కేటీఆర్ మద్దకు కోరతానని స్పష్టం చేశాడు. హెచ్సీఏలో చోటు చేసుకున్న అవకతవకలు తెలంగాణ క్రికెట్కు ఎంతో ప్రమాదకమని సూచించాడు.53 ఏళ్ల అజారుద్దీన్ ఏ క్లబ్ నుంచి నామినేషన్ దాఖలు చేశాడన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు.
అజహర్ ఎంట్రీతో హెచ్సీఏ ఎన్నికలు హాట్హాట్గా మారాయి. తాను మళ్లీ క్రికెట్ జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పిన అజర్.. అసోసియేషన్లో క్రికెట్కే ప్రాధాన్యతనిచ్చేలా చూస్తానని హామీ ఇచ్చాడు. ఒకప్పుడు హెచ్సీఏ అంటే ఎంతో గౌరవముండేదని, కానీ ఇప్పుడది లేదని అజహరుద్దీన్ తెలిపాడు. క్రికెట్ బాగుంటేనే అన్నీ బాగుంటాయని అతను అభిప్రాయపడ్డాడు.
తాను ఎక్కడికెళ్లినా హైదరాబాద్ క్రికెట్ గురించి చులకనగా మాట్లాడటం తనను బాధించిందని, ఈ పరిస్థితిని మార్చి హెచ్సీఏకు పునర్ వైభవాన్ని తీసుకొచ్చేందుకే తాను అధ్యక్ష బరిలో ఉన్నట్లు చెప్పాడు. ఒకప్పుడు హైదరాబాద్ ఎంతో మంది గొప్ప గొప్ప ఆటగాళ్లను అందించిందని, కానీ ఇప్పుడు మాత్రం వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఆ స్థాయి ప్లేయర్ ఎవరూ రాలేదని అన్నాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టెస్టు మ్యాచ్లాడిన క్రికెటర్లు ఆయా రాష్ట్ర సంఘాల ఎన్నికల్లో ఓటింగ్కు అర్హులు. అయితే హెచ్సీఏ ఎన్నికల్లో ఓటర్ల నమోదు గడువు ఆదివారంతో ముగిసింది. ఇందులో ఓటరుగా అజహరుద్దీన్ తన పేరు నమోదు చేసుకోలేదు. దీంతో అజహర్ నామినేషన్ వేసినా అది చెల్లుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక సిటీ సివిల్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో అడ్హక్ కమిటీ ఛైర్మన్ ప్రకాశ్చంద్ జైన్ ఆధ్వర్యంలో జనవరి 17న హెచ్సీఏకు ఎన్నికలు జరుగుతున్నాయి. న్యాయవాది రాజీవ్రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హెచ్సీఏలో సుమారు 216 క్లబ్లు ఉండగా 200కి పైగా క్లబ్ల కార్యదర్శులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలిసింది.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించింది. 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్ను నిర్దోషిగా తేల్చింది. భారత్ తరఫున అజహర్ 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.