|
హీరో పుజారానే:
'క్రికెట్ లైఫ్ స్టోరీస్' యూట్యూబ్ ఛానెల్లో మార్కస్ హారిస్ మాట్లాడుతూ... 'గబ్బా టెస్ట్ ఆఖరి రోజు ఆట అద్భుతం. ఆశ్చర్యం కూడా. భారత్ పరుగులు చేస్తుందా? లేదా వికెట్లను కాపాడుకుంటుందా? అని ఎంతో ఆలోచించాం. కానీ రిషబ్ పంత్ ఆ రోజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిజమైన హీరో మాత్రం చతేశ్వర్ పుజారానే. ఆసీస్ బౌలర్లను అతడే అడ్డుకున్నాడు. ఎన్నో సవాళ్లను అధిగమించాడు. పుజారా ఆస్ట్రేలియన్లా ఆడినట్టు నాకు అనిపించింది. ఛాతిపైకి వచ్చిన బంతుల దెబ్బలు తగిలినా భయపడలేదు. అతడి ఆధారంగానే మిగతా వాళ్లు బ్యాటింగ్ చేశారు' అని అన్నాడు.
జాఫర్ సెటైర్:
'రిషబ్ పంత్ ఇన్నింగ్స్ మాత్రం నమ్మశక్యం కానిది. అతడిలో ఏదో ఇంద్రజాలం ఉందని అంతా అంటారు. చాలాసార్లు అతడూ దానిని ప్రదర్శించాడు. ఆ సిరీస్ ఓడిపోవడం మాకు నిరాశ కలిగించింది. కానీ కొన్నిసార్లు క్రికెట్లో అవతలి వారిని అద్భుతంగా ఆడారని ప్రశంసించక తప్పదు' అని ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హ్యారిస్ పేర్కొన్నాడు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది కూసిన వెంటనే టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఓ సెటైర్ వేశాడు. 'ఆశ్చర్యం.. ఆస్ట్రేలియన్లు ఎందుకు ఆస్ట్రేలియన్లా బ్యాటింగ్ చేయరు' అని ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో జాఫర్ ఎపుడూ యాక్టీవ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే.
211 బంతుల్లో 56 పరుగులు:
గబ్బా టెస్టు మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా 211 బంతుల్ని ఎంతో ఓపికతో ఎదుర్కొన్న పుజారా 7 ఫోర్ల సాయంతో 56 పరుగుల విలువైన స్కోరు చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ (89 నాటౌట్: 138 బంతుల్లో 9x4, 1x6) దూకుడుగా ఆడటంతో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. పంత్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో మార్కస్ హ్యారిస్ వరుసగా 5, 38 పరుగులు చేసి నిరాశపరిచాడు. మహ్మద్ సిరాజ్, టీ నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా ఈ టూర్ ద్వారానే తమ ప్రతిభను నిరూపించుకున్నారు.
ఇంగ్లీష్ గడ్డపై కూడా చెలరేగాలని:
జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి వెళ్లనున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోతలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఢీకొట్టబోతోంది. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను, సొంత గడ్డపై ఇంగ్లండ్ను ఇటీవల మట్టికరిపించిన భారత్.. ఇంగ్లీష్ గడ్డపై కూడా చెలరేగాలని చూస్తోంది.