క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ అంత్యక్రియలు ముగిశాయి. మెల్బోర్న్లో జరిగిన ఈ కార్యక్రమానికి షేన్ వార్న్ కుటుంబసభ్యులతోపాటు 80 మంది ఇతరులు హాజరయ్యారు. వారంతా వార్న్కు బరువెక్కిన హృదయంతో కన్నీటి వీడ్కోలు పలికారు. షేన్ వార్న్ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో తల్లిదండ్రులు కీత్, బ్రిగెట్, అతడి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక క్రికెట్లో వార్న్కు సన్నిహితంగా ఉన్న ఆండ్రూ సైమండ్స్, మైకేల్ క్లార్క్, మార్క్ టేలర్, మెర్వ్ హ్యూస్, గ్లెన్ మెక్గ్రాత్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, మెర్వ్ హ్యూస్ తదితరులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఇక మార్చి 30న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆధ్వర్యంలో షేన్ వార్న్ అధికారిక స్మారక సభను నిర్వహించనున్నారు. ఈ స్మారక సభకు షేన్ వార్న్ కుటుంబసభ్యులతోపాటు స్నేహితులు అనేక మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి.
కాగా మెల్బోర్న్తో షేన్వార్న్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వార్న్ పుట్టి పెరిగిందంతా మెల్బోర్న్లోనే కావడం గమనార్హం. 1994లో యాషెస్ సిరీస్లో హ్యాట్రిక్ వికెట్లు వార్న్ మెల్బోర్న్ మైదానంలోనే సాధించాడు. ఇక 2006లో బాక్సింగ్ డే రోజున తీసిన 700వ టెస్ట్ వికెట్, అంతర్జాతీయ క్రికెట్లో తన చివరి మ్యాచ్ షేన్వార్న్ ఇక్కడే ఆడాడు.
కాగా 52 ఏళ్ల షేన్ వార్న్ ఈ నెల 4న థాయ్లాండ్లోని ఓ విల్లాలో అచేతన స్థితిలో పడి ఉండి కనిపించాడు. దీంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు షేన్ వార్న్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. క్రికెట్లో షేన్వార్న్ స్పిన్ మాంత్రికుడిగా తనదైన ముద్ర వేశాడు. ఈ క్రమంలో 145 టెస్టు మ్యాచ్ల్లో 708 వికెట్లు తీసిన వార్న్, 194 వన్డే మ్యాచ్ల్లో 293 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఐపీఎల్లోనూ ఆడిన షేన్ వార్న్ 55 మ్యాచ్ల్లో 57 వికెట్లు తీశాడు. అంతేకాకుండా కెప్టెన్గా రాజస్థాన్ రాయల్స్ను తొలి సీజన్లోనే టైటిల్ విజేతగా నిలబెట్టాడు. కాగా షేన్వార్న్ నేతృత్వంలో గెలిచిన తొలి టైటిలే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు గెలిచినదిగా ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది.