
మెకాయ్: మహిళల వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా భావిస్తున్న ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళలు ఓటమితో ప్రారంభించారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో నేడు(మంగళవారం) జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో మిథాలీ సేన చిత్తయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 225 రన్స్ చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (107 బంతుల్లో3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. యాష్కిత్ బాటియా(35), వికెట్ కీపర్ రిచా ఘోష్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32 నాటౌట్), జూలన్ గోస్వామి(24 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్తో 20) కీలక పరుగులు చేశారు. ఈ నలుగురు మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
ఓపెనర్లు స్మృతి మంధాన(16), షెఫాలీ వర్మ(8) దారుణంగా విఫలమవ్వగా.. దీప్తి శర్మ(9), పూజా వస్త్రాకర్(17)లు సైతం రాణించలేకపోయారు. ఇక ఎల్లిస్ పెర్రీ వేసిన రాకాసి బౌన్సర్ మిథాలీ తలకు బలంగా తాకింది. అయితే గాయం కాకపోవడంతో కంకషన్ టెస్ట్ తర్వాత ఆమె తన ఆటను కొనసాగించింది. ఈ మ్యాచ్లో మిథాలీ సాధించిన హాఫ్ సెంచరీ వరుసగా ఐదో వన్డే అర్థ శతకం కాగా... ఆమె అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగుల మైలు రాయి అందుకుంది.
ఆస్ట్రేలియా మహిళా బౌలర్లలో డార్సీ బ్రౌన్(4/33) నాలుగు వికెట్లతో భారత మహిళల పతనాన్ని శాసించగా.. సోఫియా, హన్నత్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మహిళలు.. 41 ఓవర్లలో వికెట్ నష్టానికి 227 రన్స్ చేసింది. ఆ జట్టు ఓపెనర్లు రాచెల్ హైన్స్(100 బంతుల్లో 7 ఫోర్లు 93 నాటౌట్), అలిస్సా హీలీ(77 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 77), కెప్టెన్ మెగ్ లాన్నింగ్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ ఓవికెట్ తీసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం(సెప్టెంబర్ 24) జరగనుంది.
సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల చేతుల్లో ఎదురైన వన్డే సిరీస్ పరాభవాల తర్వాత భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతోంది. బొటనవేలి గాయంతో వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తొలి వన్డేకు దూరమైంది. మరోవైపు ఆస్ట్రేలియా మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. 2018 మార్చి నుంచి వన్డేల్లో ఆ జట్టు ఓటమే ఎరుగలేదు. నేటి మ్యాచ్తో కలుపుకొని వరుసగా 25 వన్డేల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళలు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లతో పాటు ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. అసలే ఐపీఎల్ 2021 సెకండాఫ్ మూడ్లో భారత క్రికెట్ అభిమానులు ఉండగా.. మిథాలీ సేన ఇలాంటి పేలవ ప్రదర్శన కనబరిస్తే వారిని తమవైపు తిప్పుకోవడం కష్టం. అద్భుతంగా ఆడితేనే ఈ సిరీస్లకు ప్రేక్షకాదరణ లభించనుంది.