లారా 400 పరుగుల రికార్డును రోహిత్ మాత్రమే బ్రేక్ చేస్తాడు.. ఆ సత్తా అతనికే ఉంది: వార్నర్

అడిలైడ్: టెస్టు క్రికెట్లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా నెలకొల్పిన 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే బ్రేక్ చేస్తాడు. ఆ సత్తా అతనికే ఉంది అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. పాకిస్థాన్తో జరుగుతున్న డేనైట్ టెస్టులో వార్నర్ (335 నాటౌట్; 418 బంతుల్లో 39x4, 1x6) ట్రిపుల్ సెంచరీ చేసాడు. దీంతో ఆస్ట్రేలియా 589/3 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ప్రస్తుతం ఆసీస్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఫాలోఆన్ ఆడుతున్న పాక్.. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ స్కోర్ కంటే ఇంకా 248 పరుగులు వెనకబడి ఉంది.

రోహిత్ మాత్రమే బ్రేక్ చేస్తాడు:
శనివారం మ్యాచ్ అనంతరం వార్నర్ మీడియాతో మాట్లాడాడు. 'లారా రికార్డును బద్దలు కొట్టడం చాలా కష్టం. బౌండరీలు పెద్దవిగా ఉండడం, వేడి వంటి సమస్యలు ఉంటాయి. అయితే సమీప భవిష్యత్తులో లారా 400 టెస్టు పరుగుల రికార్డును రోహిత్ శర్మ మాత్రమే బ్రేక్ చేస్తాడు అని అనుకుంటున్నా. ఆ సత్తా అతనికే ఉంది ఉంది. ఏదో ఒక రోజు రోహిత్ ఆ రికార్డును బద్దలు కొడతాడు. అది తప్పక జరుగుతుంది' అని వార్నర్ ధీమా వ్యక్తం చేశాడు.

సెహ్వాగ్ అనుభవాన్ని పంచుకున్న వార్నర్:
ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు సెహ్వాగ్ చెప్పిన మాటలను వార్నర్ గుర్తు చేసుకున్నాడు. 'గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున ఆడుతున్నప్పుడు సెహ్వాగ్ నాతో మాట్లాడాడు. టీ20ల్లో కన్నా టెస్టుల్లోనే బాగా రాణిస్తానని అన్నాడు. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారని.. నేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఎక్కువగా ఆడలేదని సమాధానం ఇచ్చా' అని పేర్కొన్నాడు.

అందువల్లే ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేశాం:
లారా నెలకొల్పిన 400 పరుగుల పరుగుల రికార్డును వార్నర్ సాధించే అవకాశం ఉన్నా.. కెప్టెన్ టిమ్ పైన్ నిర్ణయంతో అది చేజారిపోయిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దీన్ని వార్నర్ మాత్రం లైట్గానే తీసుకున్నాడు. మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించే అవకాశం ఉండటంతో ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ను సాధ్యమైనంత తొందరగా కట్టడి చేసి మ్యాచ్పై పట్టు సాధించాలనే ఉద్దేశంతోనే పైన్ డిక్లేర్డ్ చేశాడు అని తెలిపాడు.

ఐపీఎల్-2019 ద్వారా రిఎంట్రీ:
బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొన్న వార్నర్ ఐపీఎల్-2019 ద్వారా రి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ పరుగుల వరద పారించినా.. యాషెస్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో మొత్తం 95 పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే తాజాగా పాకిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో మాత్రం చెలరేగుతున్నాడు. తొలి టెస్టులో 154 పరుగులు చేసిన వార్నర్.. రెండో టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసాడు.

రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు:
డే/నైట్ టెస్టుల్లో అజహర్ అలీ (302 నాటౌట్; విండీస్పై దుబాయ్లో 2016లో) తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్మన్గా వార్నర్ రికార్డుల్లోకి ఎక్కాడు. మాథ్యూ హేడెన్ (380; జింబాబ్వేపై 2003లో పెర్త్లో) తర్వాత ఆసీస్ తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరును వార్నర్ నమోదు చేసాడు. ఆసీస్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్గా కూడా వార్నర్ నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications