ఆస్ట్రేలియాను ఓడించడానికి
"ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇంతకుమించి మంచి అవకాశం రాదు. స్మిత్, వార్నర్ లేని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఓ సాధారణ జట్టు మాదిరి ఉంది. ఈ అరుదైన అవకాశాన్ని టీమిండియా వినియోగించుకోవాలి" అని జింఖానా మైదానంలో 80 ఏళ్ల ఫరూక్ ఇంజనీర్ చెప్పుకొచ్చారు. బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా స్మిత్, వార్నర్ ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు.
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా
"విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం చక్కటి క్రికెట్ ఆడుతోంది. కోహ్లీ జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. మంచి స్పిన్నర్లు, మంచి ఆల్ రౌండర్లతో పాటు చక్కటి బ్యాటింగ్ లైనప్తో టీమిండియా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడానికి ఇదే సరైన సమయం" అని తెలిపారు.
సెలక్టర్ల తీరుపై మండిపడ్డ ఇంజినీర్
అదే సమయంలో టీమిండియా సెలక్టర్ల తీరుపై ఇంజినీర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. సెలక్టర్ల నియామకం.. క్రికెట్ అనుభవం ఆధారంగా కాకుండా రాజకీయంగా జరిగిందని ఫరూక్ తాజాగా మరోసారి ఆరోపించాడు. "మన జాతీయ సెలక్టర్లు ఎవరు? వారికి అంతర్జాతీయ క్రికెట్ అనుభవం చాలినంత ఉందా? భారత్ జట్టుని ఎంపిక చేసేందుకు వారు అర్హులైనా?" అని ప్రశ్నించారు.
రాజకీయాలతో సెలక్టర్లని నియమించడం తగదు
"సెలక్టర్లు అంటే.. వారు కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మ్యాచ్లు ఆడి ఉండాలి. అప్పుడే వారికి ఆటలోని లోటుపాట్లు తెలుస్తాయి. అలా కాకుండా, రాజకీయాలతో సెలక్టర్లని నియమించడం తగదు" అని మండిపడ్డాడు. ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన ఐదు మందితో కూడిన సెలక్షన్ ఫ్యానల్ని సెప్టెంబరు 2016లో బీసీసీఐ నియమించింది.
ముగ్గురూ కలిపి ఆడిన టెస్టులు 13 మ్యాచ్లే
ఈ ప్యానల్లో దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజేప్, శరణ్ దీప్ సింగ్, గగన్ ఖోడాలు ఉన్నారు. ఇందులో జతిన్, గగన్కి కనీసం ఒక్క అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అనుభవం కూడా లేకపోగా, మిగిలిన ముగ్గురూ కలిపి ఆడిన టెస్టులు 13 మాత్రమే కావడంతో తాజాగా ఫరూక్ ఇంజనీర్ ఆటగాళ్ల సెలక్షన్ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.