విరాట్ కోహ్లీని ఓ పోరాట యోధుడిని చేసిన 2014 పర్యటన
2014 ఆస్ట్రేలియా పర్యటన ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ పోరాట యోధుడిని చేసింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా గడ్డపై బౌన్సర్లను ఎదుర్కొనేందుకు భారత్ బ్యాట్స్మెన్ ఆపసోపాలు పడుతున్నవేళ కోహ్లీ ఒక్కడే అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టు ఒకవైపు, తాను ఒక్కడినే మరోవైపు అన్నట్లు కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. దీంతో కోహ్లీని ఆస్ట్రేలియా బౌలర్లు టార్గెట్ చేశారు.
కోహ్లీని గాయపర్చేందుకు కూడా వెనుకాడని ఆసీస్ బౌలర్లు
తొలుత కవ్వింపులతో మొదలెట్టి.. సిరిస్ ముందుకు సాగే క్రమంలో కోహ్లీని గాయపర్చేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో కోహ్లీ సైతం నోటికి పనిచెప్పాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల కవ్వింపులకు నోటితో బదులిస్తూనే.. బ్యాట్తో పరుగుల వరద పారించాడు. ఈ పర్యటనలో మొత్తం 4 సెంచరీలు బాది ఏకంగా 694 పరుగులు చేశాడు. అప్పుడు కూడా అడిలైడ్ వేదికగానే తొలి టెస్టు మ్యాచ్ జరగగా.. రెండు ఇన్నింగ్స్ల్లోనూ (115, 141) సెంచరీలు సాధించాడు.
కోహ్లీని కవ్వించిన మిచెల్ జాన్సన్
ఆ తర్వాత మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో మిచెల్ జాన్సన్ బౌలింగ్ని విధ్వంసం సృష్టించాడు. ఈ టెస్టులో కోహ్లీ తన నోటికి సైతం పని చెప్పాడు. బౌండరీలు బాదడంతో పాటు నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న జాన్సన్కి కండలు చూపిస్తూ, ముద్దులు పెడుతూ కవ్వించే ప్రయత్నం చేశాడు.
అడిలైడ్ వేదికగా తొలి టెస్టు
కాగా, నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు కోహ్లీని కవ్వించబోమని చెప్తోంది. మరోవైపు మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దీంతో ఈసారి కోహ్లీ Vs స్టార్ల మధ్య ఆధిపత్య పోరు జరిగేలా కనిపిస్తోంది.