హైదరాబాద్: డేవిడ్ మిల్లర్ (108 బంతుల్లో 139; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), డు ఫ్లెసిస్ (114 బంతుల్లో 125; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత సెంచరీలతో దుమ్మురేపడంతో.. ఆదివారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. 2009 తర్వాత కంగారూల గడ్డపై సఫారీలకు ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 320/5 స్కోరు చేసింది. 55 పరుగులకే డికాక్ (4), హెండ్రిక్స్ (8), మార్క్రమ్ (32) వికెట్లు కోల్పోయినా డు ఫ్లెసిస్, మిల్లర్.. కంగారూల బౌలింగ్ను ఉతికి ఆరేశారు. 16వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఈ జోడీ.. నాలుగో వికెట్కు 252 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ వికెట్కు ఆసీస్పై ప్రొటీస్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 280/9 స్కోరుకే పరిమితమైంది. షాన్ మార్ష్ (102 బంతుల్లో 106; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో పోరాడినా ప్రయోజనం దక్కలేదు. స్టోయినిస్ (63), కారే (42), మ్యాక్స్వెల్ (35) ఫర్వాలేదనిపించారు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ను మార్ష్, స్టోయినిస్ నాలుగో వికెట్కు 107 పరుగుల జోడించి ఆదుకున్నారు.
అయితే సఫారీ పేసర్లు స్టెయిన్ (3/45), రబడ (3/40), ప్రిటోరియస్ (2/61) దెబ్బకు కంగారూల లోయర్ ఆర్డర్ పెవిలియన్కు క్యూ కట్టడంతో ఓటమి తప్పలేదు. మిల్లర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్; మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఇరుజట్ల మధ్య ఏకైక టీ20 ఈనెల 17న కర్రారాలో జరుగనుంది.