మాంచెస్టర్: ఇంగ్లాండ్ ముందు 383 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఆసీస్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. మూడో టెస్టులో ఇంగ్లాండ్ 359 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఛేదించి రికార్డు సృష్టించింది. 286 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయినా.. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (135*) ఒంటి చేత్తో మ్యాచును గెలిపించాడు. అతనికి బౌలర్ జాక్ లీచ్ (1*) మంచి సహకారం అందించి గొప్పగా పోరాడాడు.
'మన టాపార్డర్ సూపర్.. నాలుగో స్థానంలో బ్యాట్స్మన్ అవసరం లేదు'
ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ.. రికీ పాంటింగ్ ఆసీస్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. తాజాగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ... 'మాంచెస్టర్ పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఇప్పటికే వికెట్ మరింత మెరుగైంది. ఐదో రోజు పిచ్ మారుతుంది. ఆసీస్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐదో రోజు భారీ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. తొలి ఇన్నింగ్స్లో నాథన్ లయాన్ వికెట్లు ఏమి తీయలేదు. రెండో ఇన్నింగ్స్లో అతడు కచ్చితంగా రాణిస్తాడు. బ్రాడ్, ఆర్చర్ నిదానంగా బౌలింగ్ చేశారని నా అభిప్రాయం. 40 నిమిషాల్లో కేవలం 6 ఓవర్లే వేశారు. ఒక ఓవర్ను 7 నిమిషాలు వేయడాన్ని ఎవరూ అంగీకరించరు' అని అన్నాడు. మొత్తానికి భారీ లక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లాండ్ ఛేదించలేదని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
నాలువ రోజు 383 పరుగులు రికార్డు ఛేదనకు బరిలోదిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇంగ్లండ్ను పేసర్ ప్యాట్ కమిన్స్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడు, నాలుగు బంతులకు బర్న్స్ (0), రూట్ (0)లను బలిగొన్నాడు. అత్యద్భుతం అనదగ్గ బంతితో రూట్ వికెట్లను అతడు గిరాటేసిన బంతి మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఐదో రోజు కూడా కమిన్స్ విజృంబిచాడు. రాయ్ (31), స్టోక్స్ (1)లను పెవిలియన్ చేర్చాడు. డెన్లీ (48) మాత్రం పోరాడుతున్నాడు. లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 87 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో డెన్లీ, బెరియిస్టో (2)లు ఉన్నారు. చేతిలో ఉన్న 6 వికెట్లతో ఇంకా 296 పరుగులు చేయాల్సి ఉంది. కనీసం డ్రా చేసుకోవాలన్నా రోజంతా ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగించాల్సి ఉంటుంది.