ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయలేం: ఆస్ట్రేలియా ప్రధాని

కాన్బెర్రా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తమ తరఫున ఎలాంటి సాయం చేయలేమని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ఆస్ట్రేలియాతో పాటు చాలా దేశాలు భారత్ను రెడ్ లిస్ట్లో చేర్చాయి. విమాన రాకపోకలు రద్దు చేశాయి. దీంతో ఐపీఎల్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లగలమా? లేదా? అని తీవ్ర మధన పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది ఆసీస్ ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకున్నారు.
అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చార్టర్ విమానం ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్లేయర్ క్రిస్ లిన్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. కానీ తాము ఎలాంటి సాయం చేయలేమని ఆసీస్ ప్రధాని తేల్చేశాడు. ఐపీఎల్లో ఆడిన క్రికెటర్లంతా ప్రైవేట్గా ప్రయాణించారని, ఇదేమీ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా కాదన్నారు. అందుచేత ఆసీస్ క్రికెటర్లను తిరిగి స్వదేశానికి చేర్చేక్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేమన్నారు.

ఇది ప్రైవేట్ టోర్నీ..
ఆసీస్ క్రికెటర్ల కోసం ఏమైనా స్పెషల్ ఏర్పాట్లు చేస్తారా అనే ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీతో మాట్లాడిన మోరిసన్.. తాము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. 'వారు(ఆసీస్ క్రికెటర్లు) ప్రైవేట్గా భారత్కు వెళ్లారు. ఆస్ట్రేలియా పర్యటనలో వారేమీ భారత్కు వెళ్లలేదు. వారికి తిరిగి రావడానికి వారికున్న మౌలిక వసతులను ఉపయోగించుకునే రావాలి. ఇక్కడ వారే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నేను వారిని కోరేది ఒక్కటే.... వారు సొంత ఏర్పాట్లు చేసుకుని రావాలనే ఆఖరిగా చెబుతున్నా'అని స్పష్టం చేశారు.

ఐపీఎల్ డబ్బునే ఖర్చు పెట్టండి..
అంతకు ముందు ఐపీఎల్ ద్వారా సీఏ సంసాదించే డబ్బులనే ఖర్చుచేయాలని లిన్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. 'సీఏకు టెక్స్ట్ మెసేజ్ చేశాను. ప్రతీ ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా సీఏ 10 శాతం డబ్బును సంపాదిస్తుంది. ఇప్పుడు ఆ డబ్బును మాకు చార్టర్ విమానం వేయడానికి ఖర్చు చేస్తుందనే భావిస్తున్నా. మా కంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము కఠినమైన బయోబబుల్లో ఉంటున్నాయి. వచ్చేవారం వ్యాక్సిన్ కూడా వేయించుకుంటాము. దాంతో మమ్మల్ని టోర్నీ ముగిసిన తర్వాత చార్టర్ విమానం ద్వారా ఇంటికి చేరుస్తారని ఆశిస్తున్నా. మేము షార్ట్ కట్లు గురించి అడగడం లేదు. మేము సంతకాలు చేసేటప్పుడే రిస్క్ తెలుసుకునే చేశాం. ఈ మెగా టోర్నీ పూర్తయి ఎంత తొందరగా ఇంటికి క్షేమంగా చేరుకుంటే అంత మంచింది' అని లిన్ తెలిపాడు.

టోర్నీ ముగిసేవరకు..
సన్రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వేల్, డేనియల్ క్రిస్టియన్, క్రిస్ లీన్, ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్, టామ్ మూడీ, వంటి పలువురు ప్లేయర్లు ఐపీఎల్ 2021లో వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఆస్ట్రేలియా ట్రావెల్ బ్యాన్ విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో వారందరూ స్వదేశానికి తిరిగి వెళ్తారంటూ మొదట వార్తలొచ్చినప్పటికీ.. క్రికెట్ ఆస్ట్రేలియా వాటిని కొట్టివేసింది. టోర్నమెంట్ ముగిసే వరకూ భారత్లోనే ఉంటారని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications