
హైదరాబాద్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య గబ్బా స్టేడియంలో ప్రారంభమైన యాషెస్ తొలి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. తొలి టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలెస్టర్ కుక్ను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ స్టార్క్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత రెండో వికెట్కు స్టోన్మాన్, విన్స్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లాండ్ పుంజుకుంది.

స్టోన్మాన్ 53 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్కు ఈ జోడీ 125 పరుగులు జోడించింది. ఆ తర్వాత మరో 22 పరుగులకే విన్సీని నాథన్ లయన్ కళ్లు చెదిరే రీతిలో రనౌట్ చేశాడు. ఆంతేకాదు తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను పరుగులు చేయకుండా కట్టడి చేశాడు.
తొలిరోజు 20 ఓవర్లు వేసిన లయన్ 40 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇక, కెప్టెన్ జో రూట్ (15) పరుగులకే కమిన్స్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. పేస్కు సహకరించే బ్రిస్బేన్ మైదానంలో ఆసీస్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా, తొలిరోజు ఆట ముగిసే సమయానికి డేవిడ్ మలాన్(28), మొయిన్ అలీ(13) క్రీజులో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.