ఆ ఘనత టీమిండియాదే:
డే/నైట్ టెస్టులో ప్రత్యర్థి జట్టుపై ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏడు సార్లు డే/నైట్ టెస్టుల్లో తలపడిన ఆస్ట్రేలియా.. వరుసగా 22, 124, 287, 215, 179, 287, 250 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కానీ ప్రస్తుత మ్యాచ్లో మాత్రం ప్రత్యర్థి జట్టు కంటే 53 పరుగుల ముందే ఆసీస్ ఆలౌట్ అయింది. డే/నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఆధిక్యం సాధించిన ఘనత కేవలం టీమిండియాకే దక్కింది. ఇదే ఊపులో టెస్ట్ కూడా గెలవాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.
విదేశీ జట్ల పేలవ ప్రదర్శన:
డే/నైట్ టెస్ట్ రికార్డు చూస్తే.. ఒక్క టెస్టులో మినహా ఆస్ట్రేలియా జట్టును ప్రత్యర్థి జట్లు ఇబ్బంది పెట్టలేకపోయాయి. కంగారూలు రెండు మ్యాచ్లలో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్లో 296 పరుగులతో గెలిచారు. ఏ విదేశీ జట్టు బ్యాటింగ్ సగటు కూడా ఒక్కో వికెట్కు 30 పరుగులకు మించిలేదు. ఒకసారి దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడం మినహా 13 ఇన్నింగ్స్లలోనూ ప్రత్యర్థి జట్లు ఆలౌట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే గులాబీ బంతితో డే/నైట్ టెస్టులు ఆడటంలో అనుభవలేమినే ఈ జట్లలో కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అలాంటి స్థితిలోనే పట్టుదల కనబర్చి సిరీస్లో శుభారంభం చేయాల్సి ఉంది.
6 సార్లు విఫలం:
అడిలైడ్లో మొత్తం 78 మ్యాచులు జరగ్గా.. లక్ష్యాలను ఛేదించింది కేవలం 11 సార్లు మాత్రమే. 31 సార్లు ఆయా జట్లు విఫలమయ్యాయి. 15 సార్లు డ్రా చేసుకున్నాయి. భారత్ ఇక్కడ 8 సార్లు ఛేదనకు దిగగా.. 6 సార్లు విఫలమైంది. 1981లో ఒకసారి 331 లక్ష్య ఛేదనకు దిగి 135/8తో డ్రా చేసుకుంది. 2003లో 230 పరుగుల లక్ష్యాన్ని తొలిసారి ఛేదించింది. ఈ మైదానంలో డేవిడ్ వార్నర్ (335)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. విరాట్ కోహ్లీ, పుజారా 50+ సగటుతో పరుగులు సాధించారు. నాథన్ లియాన్ ఇక్కడ 10 మ్యాచుల్లో 51 వికెట్లు తీశాడు. అశ్విన్ 3 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్ అత్యుత్తమ గణాంకాలు:
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలి ఇన్సింగ్స్లో అశ్విన్ బౌలింగ్కు గింగిరాలు తిరిగిన ఆస్ట్రేలియా వడివడిగా వికెట్లు కోల్పోయింది. నాలుగు కీలక వికెట్లు తీసిన అశ్విన్ ఆసీస్ ఇన్నింగ్స్ను దారుణంగా దెబ్బతీశాడు. మొత్తం 18 ఓవర్లు వేసిన అశ్విన్ మూడు మెయిడెన్లు చేశాడు. 55 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాలో అశ్విన్కు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే.
62 పరుగుల ఆధిక్యం:
పింక్బాల్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పృథ్వీ షా.. రెండో ఇన్నింగ్స్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు పరుగులు మాత్రమే చేసి పాట్ కమిన్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. మయాంక్ అగర్వాల్ (5), జస్ప్రీత్ బుమ్రా (0)లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 53 పరుగులతో కలుపుకుంటే.. భారత ఆధిక్యం 62 పరుగులకు పెరిగింది.
పెళ్లి పీటలెక్కబోతోన్న 'రష్యా అందం' మరియా షరపోవా.. వరుడు ఎవరంటే?