ఇంత దారుణంగా అవమానిస్తారా?
ఆతిథ్య జట్టుని గౌరవించగా పోగా, ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటూ ఆస్ట్రేలియన్ మీడియా ప్రశ్నిస్తోంది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫిబ్రవరి 13 (సోమవారం)న దుబాయి నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకుంది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లే బ్యాగ్లను మోశారు
భారత్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విమానాశ్రయం నుంచి బయటికి వచ్చే సమయానికి వారి బ్యాగుల్ని తీసుకెళ్లే వాళ్లెవ్వరూ కనిపించలేదు. మామూలుగా అయితే బోర్డు వారి కోసం ఏర్పాట్లు చేయాలి. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లే స్వయంగా వారి పెద్ద పెద్ద కిట్ బ్యాగుల్ని మోసుకుని బయటికి తీసుకొచ్చారు.
సోషల్ మీడియాలో హల్ చల్
అంతేకాదు వారి కిట్ బ్యాగులను తీసుకెళ్లే వ్యానులో వాళ్లే లోడ్ చేసుకున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అందిస్తున్న కిట్ బ్యాగ్ను డీసీఎం వ్యాన్లో ఉండి వార్నర్ అందుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘ఇదేమీ మాకు నామోషీగా అనిపించడం లేదు. ఇదంతా టీమ్ వర్క్లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇలా మా అంతట మేం చేసుకుంటేనే పని తొందరగా అవుతుంది' అని ఆస్ట్రేలియా జట్టు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
వివరణ ఇచ్చిన బీసీసీఐ అధికారి
తాజాగా ఇది వివాదం అవడంతో తాము కూలీలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా ఆసీస్ క్రికెటర్లు తామే లగేజీ ఎత్తేందుకు ఆసక్తి చూపించారని బీసీసీఐ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంత సిద్ధమైనా పర్యాటక జట్టుని ఇలా బ్యాగ్లు మోయించడం మంచిది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు.