సిడ్నీ: గత మార్చి నుంచి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కొన్ని క్రికెట్ సిరీస్లు రద్దవగా.. మరికొన్ని వాయిదాపడ్డాడు. తాజాగా వైరస్ కారణంగా మరో కీలక పర్యటన వాయిదా పడింది. ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్ల మధ్య ఆగస్టులో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ వైరస్ కారణంగా వాయిదాపడింది. గత కొద్దిరోజుల నుంచి ఆస్ట్రేలియాలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో.. సిరీస్ని అక్కడ నిర్వహించడం కష్టమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం స్పష్టం చేసింది.
షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ఆస్ట్రేలియా-జింబాబ్వే సిరీస్ జరగాల్సి ఉంది. ఆగస్టు 9న తొలి వన్డే, 12న రెండో వన్డే, 15న మూడో వన్డే షెడ్యూల్ అయి ఉంది. అయితే ఆస్ట్రేలియాలో ఇప్పటికే 7,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 104 మంది మృతిచెందారు. దీంతో జింబాబ్వే క్రికెట్ బోర్డుతో మాట్లాడి.. పరస్పర అంగీకారంతోనే ఈ వన్డే సిరీస్ని వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. జింబాబ్వే జట్టు 2003-04లో చివరిగా ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఆడింది.
క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి నిక్ హాక్లీ మంగళవారం మాట్లాడుతూ... 'షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ఆస్ట్రేలియా-జింబాబ్వే సిరీస్ జరగాల్సి ఉంది. అయితే వైరస్ కారణంగా సిరీస్ నిర్వహించడం సాధ్యం కాదు. సిరీస్ను వాయిదా వేయడంపై నిరాశ చెందుతున్నప్పటికీ మరో మార్గం లేదు. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, వాలంటీర్లు మరియు మా అభిమానుల ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యం. ఇది సరైన నిర్ణయం' అని అన్నారు.
ఆస్ట్రేలియాలో సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాలపై నిషేధం ఉండటంతో జింబాబ్వే జట్టు ఆ దేశంలో అడుగుపెట్టే అవకాశం ఏమాత్రం లేదు. దానికి తోడు అక్కడికి వెళ్లిన జింబాబ్వే టీమ్ 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. దాంతో పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత సిరీస్ని నిర్వహిస్తామని సీఏ హామీ ఇచ్చినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు వెల్లడించింది. ప్రత్యామ్నాయ తేదీలలో సిరీస్ ఆడటానికి వారు కట్టుబడి ఉన్నారని తెలిపింది. మరోవైపు అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 ప్రపంచకప్ని కూడా వాయిదా వేయాలని ఐసీసీ భావిస్తోంది.
కరోనా వైరస్ కారణంగా భారత క్రికెట్ జట్టు ఇటీవలే రెండు పర్యటనలను రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో జింబాబ్వేతో కోహ్లీసేన మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంకతో పాటు జింబాబ్వే పర్యటన కూడా బీసీసీఐ రద్దు చేసుకుంది. ఈ రెండు పర్యటనల గురించి తర్వాత ఆలోచిస్తామని బీసీసీఐ పేర్కొంది.
కాఫీ కప్పుతో కేఎల్ రాహుల్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు!!