బ్రిస్బేన్: వెస్టిండీస్తో సొంతగడ్డపై జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో సమష్టిగా చెలరేగిన ఆసీస్ 31 పరుగుల తేడాతో పర్యాటక వెస్టిండీస్ను చిత్తు చేసింది. కీలక టీ20 ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసింది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఫామ్లోకి రావడం ఆ జట్టుకు కొండంత బలాన్నిచ్చింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది.
డేవిడ్ వార్నర్(41 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో రాణించగా.. టీమ్ డేవిడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్లతో 42) ధాటిగా ఆడాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ మూడు వికెట్లు తీయగా.. ఓబెడ్ మెక్కాయ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓడియన్ స్మిత్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. జాన్సన్ చార్లెస్(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29), అకీల్ హోస్సెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ నికోలస్ పూరన్(2) తన పేలవ ఫామ్ కొనసాగించగా.. ఇతర బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. కామెరూన్ గ్రీన్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.