
హైదరాబాద్: 2025కల్లా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డులన్నీ కనుమరుగవుతాయి. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? నాగపూర్కు చెందిన క్రికెట్ జ్యోతిష్కుడు నరేంద్ర బుండే. అయితే సచిన్ రికార్డులను బద్దలు కొట్టేది మరెవరో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే అంట.
ఈ విషయాన్ని డీఎన్ఏఇండియా.కామ్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో నరేంద్ర వెల్లడించాడు. "గతంలో నేను చెప్పిన అంచాలన్నీ నిజమయ్యాయి. 2025కల్లా విరాట్ కోహ్లీ టీ20, వన్డే వరల్డ్ కప్లను గెలుస్తాడు. అలాగే సచిన్ 100 సెంచరీల రికార్డు బద్దలు కొడతాడు" అని వెల్లడించాడు.
అదే విధంగా 2018లో విరాట్ కోహ్లీ అతి పెద్ద ఎండార్సెమెంట్ ఒప్పందం కుదుర్చుకుంటాడని తెలిపాడు. ఈ ఒప్పందాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను మల్టీ మిలియనీర్ను చేసిన మార్క్ మస్కరెన్హాస్ ఒప్పందంతో పోల్చాడు. కానీ ఇందులో డబ్బు విలువ చాలా చాలా ఎక్కువగా ఉంటుందని అన్నాడు. విదేశాల్లో కూడా కోహ్లీ సారథ్యంలోని టీమిండియా అద్భుత విజయాలను నమోదు చేస్తుందని చెప్పాడు.
"విరాట్ కోహ్లీ గ్రహస్థితి (శుక్రుడు) చాలా బలంగా ఉన్నాడని ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీ విదేశాల్లో కూడా రాణిస్తాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుంది" అని చెప్పాడు. గతంలో కూడా ఈ క్రికెట్ జ్యోతిష్కుడు చెప్పిన అంచనాలు నిజం కావడంతో వార్తల్లో నిలిచాడు.
అంతకముందు సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో గాయం తర్వాత పునరాగమనం చేస్తాడని, భారతరత్న అవార్డు కూడా వస్తుందని ముందే చెప్పాడు. దీంతో పాటు సౌరవ్ గంగూలీని జట్టు నుంచి గ్రెగ్ ఛాపెల్ తప్పించినప్పటికీ అతడు తిరిగి జట్టులో చోటు దక్కించుకుంటాడని చెప్పాడు. గంగూలీ, శ్రీశాంత్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతీ జింతా గతంలో నరేంద్రను కలిసి సలహాలు తీసుకున్న వారిలో ఉన్నారు.