న్యూఢిల్లీ: దుబాయ్ వేదికగా పోరాడిన టీమిండియా ఏడోసారి ఆసియాకప్ను ముద్దాడింది. దీంతో భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం జరగాల్సి ఉన్న ఆసియా కప్ టోర్నీకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకుండాపోయాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను తాత్కాలిక కెప్టెన్గా ఓపెనర్ రోహిత్ శర్మ అందుకున్నాడు.
ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ అంచనాలకు తగ్గట్టే ప్రదర్శన చూపింది. శుక్రవారం బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠభరిత తుదిపోరులో విజయం భారత్నే వరించింది. ఈ కప్లో భాగంగా కెప్టెన్గా రోహిత్ శర్మ అద్భుతమైన తీరు కనబరిచాడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి పొగడ్తలతో ముంచెత్తారు. శుక్రవారం రాత్రి ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
'రోహిత్ నెమ్మదితనం, చాకచక్యంతో అతడు కెప్టెన్సీ బాధ్యతలను ఎంతో బాగా నిర్వర్తించాడు. ప్రతిమ్యాచ్లోనూ రోహిత్ అనుసరించిన వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయి. ఆసియా కప్లో భాగంగా మొదట భారత్-హాంగ్కాంగ్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నాడో ఫైనల్లో బంగ్లాదేశ్తోనూ అవే అనుసరించాడు. ఇది నిజానికి చాలా గొప్ప విషయం.'
'ప్రత్యర్థుల పరిస్థితులను బట్టి జట్టును మలచడం చాలా కొద్ది మంది మాత్రమే అనుసరించే ట్రిక్. ఈ విషయంలో రోహిత్ సఫలమయ్యాడు. టీమిండియా జట్టుకు ఫీల్డింగ్ ప్లస్ అయింది. మ్యాచ్లో భాగంగా బౌలింగ్లో మార్పులు చేయడం అభినందించదగ్గ విషయం. ఇంగ్లాండ్ పర్యటన ప్రభావం ఎంతమాత్రం ఆసియాకప్ మీద పడలేదు. అక్కడ పరిస్థితులు వేరు. దుబాయ్ పరిస్థితులు వేరు. విజయాల గురించి కాకుండా అక్కడ టీమిండియా ఆడిన తీరు గురించి ఆలోచించండి' అని ప్రశంసించారు.