న్యూ ఢిల్లీ: ఇంగ్లాండ్కు సుదీర్ఘ పర్యటన నిమిత్తం బయల్దేరిన టీమిండియా ఇంకా తిరుగుప్రయాణం అవ్వనే లేదు. సెప్టెంబర్ 15 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ గురించి వాడివేడి చర్చ మొదలైపోయింది. ఎన్నాళ్లుగానో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న భారత్-పాక్ల మ్యాచ్ జరగనుండటంతో ఆ మ్యాచ్పై విశ్లేషకులు అంచనాలు వేయడం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ స్పందించాడు.
ఆసియా కప్లో అత్యంత ఆసక్తిరేపుతున్న ఈ దాయాదుల పోరు గురించి మిచెల్ జాన్సన్ మాట్లాడుతూ 'చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్లో భారత్ ఆధిపత్యం చెలాయించాలంటే హార్దిక్ పాండ్య, ఉమేశ్ యాదవ్ ప్రదర్శన కీలకం. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో హార్దిక్ పాండ్య అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్ను అర్థం చేసుకుని పేస్ను రాబడుతూ తెలివిగా బంతిని విసురుతున్నాడు. అదే జోరుని ఆసియా కప్లోనూ కొనసాగిస్తే.. పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్కి కష్టాలు తప్పవు. అలానే ఉమేశ్ యాదవ్ కూడా. ఆసియా కప్లో ఉమేశ్ ఎలా బౌలింగ్ చేస్తాడో..? చూడాలని ఉంది' అని వెల్లడించాడు.
ఆసియా కప్లో భారత ఫాస్ట్ బౌలర్లు హార్దిక్ పాండ్య, ఉమేశ్ యాదవ్ చెలరేగితే పాకిస్థాన్ జట్టుని భారత్ అలవోకగా ఓడించగలదని మిచెల్ జాన్సన్ అభిప్రాయపడ్డాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 15 నుంచి 28 వరకు ఆసియా కప్ జరగనుండగా.. భారత్ జట్టు సెప్టెంబరు 19న పాకిస్థాన్తో ఢీకొననుంది. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు చివరిగా పాకిస్థాన్తో తలపడగా.. ఆ మ్యాచ్లో పాక్ గెలుపొందిన విషయం తెలిసిందే.
ఆసియా కప్లో 18న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. తర్వాత రోజే పాకిస్థాన్తో ఢీకొట్టనుంది. 2016లో ఆసియా కప్ని టీ20 ఫార్మాట్లో నిర్వహించగా.. భారత్ జట్టు విజేతగా నిలిచింది. అయితే.. ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో ఆసియా కప్ జరగనుంది.