
హైదరాబాద్: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అశ్విన్పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఆసీస్ మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హెడెన్ చేరాడు.
మరో ఐదేళ్లు అశ్విన్ ఇలాగే ఆడితే దిగ్గజ క్రికెటర్ల జాబితాలో చేరతాడని అన్నాడు. అయితే ఆఫ్ స్పిన్నర్లతో పోలిస్తే అశ్విన్ కంటే హర్భజన్ సింగ్ చాలా దూకుడుగా ఉంటాడని కొనియాడాడు. ఈ సందర్భంగా హెడెన్ మాట్లాడుతూ 'అశ్విన్ ఒక గొప్ప స్పిన్నర్. అందులో ఎటువంటి సందేహం లేదు. టెస్టుల్లో 300 వికెట్లను అత్యంత వేగంగా సాధించినందుకు అభినందిస్తున్నా' అని అన్నాడు.
'మరో ఐదేళ్లు ఇలాగే ఆడితే తన జనరేషన్లో దిగ్గజ ఆటగాడిగా నిలుస్తాడు. అశ్విన్ ఒక స్పిన్ మాస్టర్ అయినప్పటికీ... అశ్విన్లో హర్భజన్ వంటి దూకుడు లేదు. హర్బజన్ ఆడే రోజుల్లో ఒంటి చేత్తో జట్టును గెలిపించేవాడు. ప్రధానంగా మాతో జరిగిన మ్యాచ్ల్లో హర్భజన్ ఆడకపోతే భారత జట్టు ఇబ్బందుల్లో పడేది. ఆ సమయంలో భారత విజయాల్ని హర్భజన్ భుజస్కందాలపై మోసేవాడు' అని పేర్కొన్నాడు.

'అప్పట్లో భజ్జీకి సరైన ఫాస్ట్ బౌలింగ్ సపోర్ట్ లేదు. కానీ, ఇప్పుడు అశ్విన్కు చక్కటి ఫాస్ట్ బౌలింగ్ సహకారం కూడా ఉంది. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో మొహ్మద్ షమీ, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, బూమ్రా వంటి పేసర్లు ఉన్నారు. ఇక, రెండో స్పిన్నర్ రూపంలో జడేజా ఉండనే ఉన్నాడు' అని తెలిపాడు.
'వీరంతా అశ్విన్ తన పని తాను చేసుకుపోవడానికి ఉపయోగపడుతున్నారు. దాంతో ఫాస్ట్ బౌలర్ల సహకారం భజ్జీ కంటే అశ్విన్కే ఎక్కువ ఉందనే చెప్పాలి. నిజానికి హర్భజన్ తాను ఆడే రోజుల్లో ఆధిపత్య బౌలర్గా ఉన్నాడు. ఆస్ట్రేలియాపై మ్యాచ్ అంటే చాలు చాలా దూకుడుగా ఉండేవాడు. భజ్జీ వికెట్లు తీయకపోతే భారత్ ఇబ్బందుల్లో పడేది' అని అన్నాడు.
'నాకు తెలిసి వెంకటేశ్ ప్రసాద్ టెస్టుల్లో అద్భుతమైన బౌలర్ ఏమీ కాదు. ఆ సమయంలో హర్భజన్ సింగ్ ఓ రోల్ మేకర్లా కనిపించాడు. అయితే జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ... వారి వల్ల ప్రత్యర్ధి జట్లకు తక్కువ అపాయం ఉండేది' అని హెడెన్ తెలిపాడు. కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లపై కూడా హెడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.