
హైదరాబాద్: అడిలైడ్ ఓవల్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సరికి 191/7తో నిలిచింది.
రెండో రోజైన శుక్రవారం ఆటలో భాగంగా అశ్విన్ 50 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో ఆతిథ్య జట్టు బ్యాట్స్మెన్ను అశ్విన్ బాగా ఇబ్బంది పెట్టాడని గవాస్కర్ పేర్కొన్నాడు. అశ్విన్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఆసీస్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారని తెలిపాడు. గవాస్కర్ మాట్లాడుతూ నాథన్ లయాన్ నుంచి అశ్విన్ రెండు మూడు టెక్నిక్స్ నేర్చుకున్నాడని కొనియడాడు.
"మన జట్టుకు సాయపడుతుందని అనిపిస్తే ప్రత్యర్థి నుంచి నేర్చుకోవడంలో తప్పులేదు. కాపీ మాత్రం కొట్టొద్దు. అశ్విన్ది మాత్రం అద్భుతమైన బౌలింగ్. కోహ్లీ అడిగిన దానికన్నా బాగా బౌలింగ్ చేశాడు. ఆఫ్ స్పిన్నర్లకు ఉండే వైవిధ్యాన్ని మించి బౌలింగ్పై ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. చక్కని లైన్ అండ్ లెంగ్త్ కొనసాగించాడు" అని చెప్పుకొచ్చాడు.
"కమిన్స్ బ్యాటింగ్కు వచ్చినప్పుడు మాత్రం కాస్త భిన్నంగా వేశాడు. అతడి బౌలింగ్లో దూకుడుగా ఆడేందుకు బ్యాట్స్మెన్ ఎవరూ ధైర్యం చేయలేదు" అని గవాస్కర్ తెలిపాడు. కాగా, అడిలైడ్ టెస్టులో ఆతిథ్య జట్టుపై టీమిండియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 151/3తో నిలిచింది. పుజారా(40), రహానే(1) క్రీజులో ఉన్నారు.
ఓవర్నైట్ స్కోరు 191/7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకోవడంతో ప్రస్తుతం భారత్ 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 150 పరుగులు చేస్తే.. అడిలైడ్ టెస్టుపై భారత్ పట్టు బిగించే అవకాశం ఉంది.
పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో మూడో రోజు 71.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆటలో భాగంగా కోహ్లీ(34) ఆఖర్లో పెవిలియన్కు చేరాడు. ఈ కోహ్లీని ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో కోహ్లీని ఎక్కువసార్లు పెవిలియన్కు చేర్చిన బౌలర్గా నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. లియాన్ కోహ్లీని ఆరుసార్లు ఔట్ చేయగా.. అండర్సర్, స్టువర్ట్ బ్రాడ్ ఐదేసి సార్లు ఔట్ చేశారు.