ప్రపంచకప్ ఫైనల్ను మర్చిపోయినా.. ఏప్రిల్ 2ను మాత్రం మర్చిపోను.. ఎందుకంటే: నెహ్రా

ఢిల్లీ: కోట్లాదిమంది భారతీయుల కల సాకారమైన రోజు ఏప్రిల్ 2. ఎందుకంటే.. 28 ఏళ్ల తర్వాత తిరిగి భారత్ రెండో ప్రపంచకప్ను ముద్దాడింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిరకాల స్వప్నం నెరవేరిన సందర్భం కూడా అదే. 2011 ఏప్రిల్ 2న ఫైనల్లో శ్రీలంకపై నెగ్గిన ధోనీ సేన దేశానికి కప్పు అందించింది. ఆనాటి ఆ విజయ జ్ఞాపకాలను తాజా, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఏప్రిల్ 2ను మర్చిపోను:
గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్కు దూరమైన మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రపంచకప్పై ఓ సరదా ట్వీట్ చేసాడు. 'ఒకవేళ నేను ఆ ప్రపంచకప్ ఫైనల్ను మర్చిపోయినా.. ఏప్రిల్ 2వ తేదీని మాత్రం మర్చిపోను. ఎందుకంటే.. అది మా పెళ్లి రోజు. మా వివాహమై పదకొండేళ్లు పూర్తయ్యాయి. ప్రపంచకప్ గెలిచి తొమ్మిదేళ్లు అయింది. అవి రెండు కలిపితే 20.. ప్రస్తుతం మనం 2020లో ఉన్నాం' అని నెహ్రా సరదాగా పేర్కొన్నాడు.

జట్టుగా ఆడి విజేతగా నిలిచాం:
'ఇంగ్లాండ్పై జహీర్ ఖాన్ ఉత్తమ ప్రదర్శన.. సెమీస్లో సచిన్ బ్యాటింగ్.. టోర్నీలో యువరాజ్ సింగ్ పోరాటం.. ఫైనల్లో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోనీల మెరుపులు ఇలా జట్టుగా ఆడి విజేతగా నిలిచాం. మైదానంలో ఏడుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ.. ఆ రోజు గెలిచిన తర్వాత కన్నీళ్లు ఆగలేదు. అయితే ఆ తర్వాత ఆ జట్టులోని 11 మంది కలిసి మరో మ్యాచ్ ఆడలేదు. అలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు' అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేసాడు.

మాటలు సరిపోవు:
'2011 వన్డే ప్రపంచకప్ క్షణాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. ప్రతి భారతీయుడికి అదో గొప్ప సందర్భం. దాని కోసమే మేం జీవించాం' అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. యువరాజ్ తన ఆల్రౌండ్ షోతో టోర్నీలో విషయం తెలిసిందే. 362 పరుగులు, 15 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ టోర్నీ'గా నిలిచాడు.

గంభీర్ అసంతృప్తి:
టోర్నీలో జట్టు సమష్టి ప్రదర్శనను వదిలేసి కేవలం ఎంఎస్ ధోనీ కొట్టిన సిక్సర్ గురించే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకోవడంపై మాజీ ఓపెనర్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'మొత్తం దేశం, పూర్తి టీమిండియా, సహాయక సిబ్బంది అందరూ కలిసి 2011 ప్రపంచకప్ను గెలిచారు. మీ మదిలో బలంగా నాటుకుపోయిన ఆ సిక్సర్ మాత్రమే కాదు' అని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications