నెహ్రాకే టికెట్లు దొరకలే..
ఎంతలా అంటే భారత జట్టు ఆటగాడికే మ్యాచ్ టికెట్లు దొరకనంత.! అవును భారత్ జట్టులోని నాటి పేసర్ ఆశిష్ నెహ్రాకు ఆ మ్యాచ్ టికెట్లు దొరకలేదంట. అనూహ్యంగా చంఢీగడ్ వేదికగా జరిగిన నాటి సెమీఫైనల్లో దాయాదులు తలపడటంతో తన కుటుంబ సభ్యులకు టికెట్లు తెచ్చివ్వడం కష్టమైందంట. ఈ విషయాన్ని నెహ్రానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. అయితే నాటి పాకిస్థాన్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్లు తనకు టికెట్లు సమకూర్చారని నెహ్రా తెలిపాడు.
ఊహించలేదు..
‘ఆ మ్యాచ్కు రెండు, మూడు రోజుల ముందు సెమీస్లో భారత్-పాక్ తలపడుతాయని ఎవరూ ఊహించలేదు. కానీ 72 గంటల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్-పాక్ మధ్యే సెమీస్ జరుగుతుందని ప్రతీ ఒక్కరికి తెలిసిపోయింది. దీంతో మ్యాచ్ చూసేందుకు టికెట్లు లేకున్నా చాలా మంది అమెరికా, ఇంగ్లండ్ నుంచి వచ్చారు. ఇక చండీగఢ్లో ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా పెద్దగా ఉండవు.'అని తెలిపాడు.
అందరికంటే నా దగ్గరే ఎక్కువ..
ఇక పాక్తో మ్యాచ్ అనగానే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా టికెట్లు కావాలన్నారని, దీంతో తాను పాకిస్థాన్ ఆటగాళ్లను సాయం కోరాల్సి వచ్చిందన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే నేను మాత్రం చాలా లక్కీ. ఎందుకంటే నాకు పాకిస్థాన్ తరఫున కొన్ని ఎక్స్ట్రా టికెట్లు వచ్చాయి. నాకు రెండేసి టికెట్లు కావాలని షాహిద్ అఫ్రిది, అక్తర్ను అడిగాను. వకార్ యూనిస్ పాక్ కోచ్. వారు అడగ్గానే ఇచ్చారు. దీంతో మొత్తం 30 మంది ఆటగాళ్లలో నా దగ్గరే ఎక్కువ టికెట్లు ఉన్నాయి.'అని తెలిపాడు.
రాణించిన నెహ్రా..
ఇక నాటి మ్యాచ్లో నెహ్రా(2/33) అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. సచిన్ టెండూల్కర్(85) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం ఛేజింగ్కు దిగిన పాక్.. భారత బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. జహీర్, నెహ్రా, మునాఫ్, హర్భజన్, యువరాజ్లు రెండేసి వికెట్లు పడగొట్టారు.