హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీ. ఈ టోర్నీలో ఆడటం వల్లే ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. మరికొంత మంది అయితే ఏకంగా జాతీయ జట్టులోనే చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ టోర్నీలో ఆడటం అనేది యువ క్రికెటర్ల కల.
అలాంటి ఐపీఎల్ ఆడకపోవడం వల్లే తన బ్యాటింగ్ మరింత మెరుగైందని ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. సోమవారం సిడ్నీలో మీడియాతో మాట్లాడిన మిచెల్ మార్ష్ ఐపీఎల్-2017 సీజన్ నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయంతోనే తన టెస్ట్ కెరీర్కు ఊపొచ్చిందని పేర్కొన్నాడు.
గతేడాది జరిగిన వేలంలో మిచెల్ మార్ష్ను రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టు రూ. 4.8 కోట్లకు కోనుగోలు చేసింది. అయితే అందుకు భిన్నంగా మిచెల్ మార్ష్ ఐపీఎల్ నుంచి తప్పుకుని ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్ మికైల్ డి వెనుటో ఆధ్వర్యంలో ససెక్స్ తరఫున టెస్టు ఫార్మాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.
దీని ఫలితంగానే ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. పెర్త్లోని వాకా స్టేడియంలో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో తన కెరీర్లో తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
'డబ్బు పరంగా చూస్తే నేను తీసుకుంది చాలా కఠిన నిర్ణయమే. ఆస్ట్రేలియా తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలన్నది నా లక్ష్యం. నా ఆట మెరుగు పరుచుకోవాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నా. దాని ఫలితంగా ఇంత త్వరగా టెస్ట్ల్లోకి ఎంపిక అవుతానని అనుకోలేదు. మరిన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడాలని నేను కోరుకుంటున్నా' అని మార్ష్ చెప్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.