
హైదరాబాద్: జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం సోమావరం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు విషయమై సోషల్ మీడియాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, ఆర్టికల్ 370కి ధోనికి ఏం సంబంధం అని అనుకుంటున్నారా?
అయితే, ఇది చదవాల్సిందే. జమ్మూ కాశ్మీర్ విభజన విషయంలో బీజేపీ పక్కా వ్యూహంతో వ్యవహరించింది. ఆర్టికల్ 370 రద్దుతో పాటు రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న నిర్ణయం అమలు విషయంలో ఆచితూచి అడుగులు వేసింది. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మోడీ ప్రభుత్వానికి పట్టిన రోజులు కేవలం 11 రోజులు మాత్రమే.
బలగాల మోహరింపు నుంచి బిల్లు సభలో పెట్టడం వరకు ఆగస్టు 5లోగా పూర్తి చేయాలని మోడీ, అమిత్ షా ద్వయం నిర్ణయించి వ్యూహాన్ని అమలు చేసింది. ఇందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తన ముందుండి నడిపించారు. ఈ నేపథ్యంలో MSD(మోడీ, షా, ధోవల్) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ ముగ్గురిని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పోలుస్తూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధోని నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ నిర్వహించే మూడు ట్రోఫీలు(ఐసీసీ వన్డే వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్, ఛాంపియన్స్)ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. మైదానంలో ధోని కామ్గా తన పని తాను చేసుకుపోతుంటాడు.
అచ్చం ధోనిలాగే ఈ ముగ్గురూ యావత్ జాతి మొత్తం గర్వించే పనిని సోమవారం కామ్గా కానిచ్చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో అధికార ప్రకటన వెలువడే వరకు వారంతా ఏం జరుగుతుందోనని ఆసక్తిగా వేచి చూశారు.
1971లో జరిగిన యుద్ధం సమయంలో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి నిర్ణయం అమలులో భాగంగా కేంద్రం తొలుత సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దిపింది. ఆదివారం సాయంత్రం నాటికి 430 కంపెనీల సీఆర్పీఎఫ్ ట్రూప్స్కు చెందిన 43వేల మంది పారామిలటరీ బలగాలు జమ్మూ కాశ్మీర్లో మోహరించాయి.
వారిని తరలించేందుకు కేంద్రం ఇండియన్ ఆర్మీ సాయం తీసుకుంది. బలగాలను తరలించేందుకు ఎయిర్ఫోర్స్లో కొత్తగా చేరిన సీ - 17 గ్లోబ్ మాస్టర్ విమానాలు వారం రోజుల్లో 100కు పైగా చక్కర్లు కొట్టాయి. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొనటంతో కేసుల విచారణ కోసం అదనంగా జడ్జిలను నియమించారు.
దాదాపు 60 మంది అడిషనల్ స్పెషన్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ల సేవలు తీసుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ హింసాత్మక ఘటనలు తలెత్తితే అందుకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేందుకు మొబైల్ మెజిస్ట్రేట్లు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఘర్షణలు తలెత్తితే పలువురు గాయపడే అవకాశముంది.
ఈ నేపథ్యంలో వారికి సేవలందించేందుకు ప్రభుత్వ డాక్టర్ల సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు. సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాపించే అవకాశం ఉండటంతో ఆదివారం అర్థరాత్రి మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని నిలిపివేశారు. శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారు జామున 4గంటల నుంచి ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా పనిచేయడం మానేశాయి.
సెల్ఫోన్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో భద్రతా సిబ్బంది కోసం భారీ సంఖ్యలో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా 70 ఏళ్ల నుంచి భారత్కు తలనొప్పిగా మారిన కాశ్మీర్ సమస్యను చాలా తెలివిగా ఈ ముగ్గురూ పరిష్కరించారు.
కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో రాష్ర్టాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది.
ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడక ముందు మొత్తం 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. జమ్మూకశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను వెనువెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది.
మరోవైపు ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 7వ తేదీన ప్రకటన చేయనున్నారు. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా పీడీపీ సభ్యులు రాజ్యసభలో చొక్కాలు చించుకుని నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఆర్టికల్ 370 రద్దును కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.