ఐపీఎల్ నిలిచిపోతే భారీగా ఆర్థిక నష్టం:
కరోనా వైరస్ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ స్పందించాడు. 'కరోనా కారణంగా ఐపీఎల్ నిలిచిపోతే మాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఏదేమైనా, ఇలాంటి పరిస్థితుల్లోనూ మేమంతా సమష్టిగా ఉంటాం. దీర్ఘకాలంలో ఎప్పుడో ఒకసారి ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. అయితే అదెప్పుడు జరుగుతుందనేది మాత్రం ఇప్పుడు నేను చెప్పలేం' అని ఫించ్ అన్నాడు.
గతంలో ఎప్పుడూ చూడలేదు:
'విదేశీ ప్రయాణాలపై ఇలా ఆంక్షలు విధించడం ఎప్పుడూ చూడలేదు. కొన్ని గంటల్లోనే ఆ నిర్ణయాలు ఆయా దేశ ప్రభుత్వాలు తీసుకున్నాయి. మరో రెండు, మూడు వారాల్లో పరిస్థితుల్లో మార్పు రావొచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకోలేని సందర్భం ఇది. మన చుట్టూ ఉండే వారు క్షేమంగా ఉండేలా చూసుకోవాలి. అందరూ తమ వంతుగా వైరస్ కట్టడికి తోడ్పడాలి' అని ఫించ్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా గతంలో 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' ఇవ్వగా.. ఇప్పుడు వాటిని పునఃసమీక్షిస్తామని చెప్పింది.
రెవెన్యూ షేర్ మోడల్ పద్ధతి:
ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న వైరస్ కారణంగా ఆసీస్ ప్రభుత్వం విదేశీ ప్రయాణాలపై కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడేది సందేహంగా మారింది. కరోనా కారణంగానే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ద్వైపాక్షిక సిరీస్లు కూడా రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ క్రికెటర్లకు వచ్చే ఆదాయంపైనా దెబ్బపడుతుంది. ఎందుకంటే.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల ఆదాయం వాటాల పద్ధతి (రెవెన్యూ షేర్ మోడల్)లో ఉంటుంది. దీంతో బోర్డు నష్టపోతే ఆటగాళ్లు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఐపీఎల్ జరగకుంటే.. ఇక అంతే సంగతులు.
బెంగుళూరుకు ఫించ్:
ఐపీఎల్ 13వ సీజన్ కోసం గతేడాది నిర్వహించిన వేలంలో ఆరోన్ ఫించ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంచైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ఏప్రిల్ 15న ఐపీఎల్ ప్రారంభమైతే ఆసీస్ కెప్టెన్.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఆడే అవకాశం ఉంది. మరోవైపు ఐపీఎల్ జరిగితే ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆడుతాడని అతని మేనేజర్ జేమ్స్ తాజాగా స్పష్టం చేశాడు. జరగకపోతే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరపున వార్నర్ ఆడనున్న విషయం తెలిసిందే.