హైదరాబాద్: శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా పల్లెకెలె వేదికగా భారత్, శ్రీలంకల మధ్య గత ఆదివారం మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.
3వ వన్డే: రోహిత్ శర్మ సెంచరీ, 3-0తో సిరిస్ కైవసం
మూడో వన్డేలో శ్రీలంక జట్టు ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో లంక అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. టీమిండియా లక్ష్యానికి చేరువైన క్రమంలో ప్రేక్షకులు గ్రౌండ్లోకి బాటిల్స్ విసిరేశారు. దీంతో అంపైర్లు మ్యాచ్ను 35 నిమిషాల పాటు అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.
మ్యాచ్ నిలిచే సమయానికి 44 ఓవర్లకు టీమిండియా 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రోహిత్శర్మ(122), ధోని (61) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం మాజీ క్రికెటర్, ప్రస్తుతం శ్రీలంక పెట్రోలియం మంత్రిగా ఉన్న అర్జున రణతుంగ స్థానిక మీడియాతో మాట్లాడారు.
'క్యాండీలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అభిమానులు వాటర్ బాటిల్స్ విసిరి నిరసన వ్యక్తం చేశారు. శ్రీలంక అభిమానులు కాస్త ఓర్పుతో పాటు సంయమనాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి సంఘటనలను పునరావృతం చేయొద్దు. శ్రీలంక ప్రజలు క్రికెట్ని ప్రేమిస్తారు. మేం మ్యాచ్ ఓడిపోయినప్పుడు వారెంతో బాధకు గురవుతారు' అని అన్నారు.
'క్రికెట్ కోసం ఎన్నో వదులుకున్నాం. వరుస ఓటములతో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానుల్ని ఒకటే కోరుతున్నాను. దయచేసి భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించొద్దు. మనకంటూ మంచి చరిత్ర, సంస్కృతి ఉంది. ఇలాంటి ప్రవర్తనను మన చరిత్ర, సంస్కృతికి చెడ్డపేరు తెస్తుంది' అని రణతుంగ అన్నారు.
అయితే అర్జున రణతుంగ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. 1996లో వరల్డ్ కప్లో భాగంగాఈడెన్గార్డెన్లో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్లో టీమిండియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా వరుస వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్ విసిరి, ప్లకార్డులు తగలబెట్టి అప్పట్లో పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసిందే.