ముంబై : ఆటలో పాలిటిక్స్ ను మిక్స్ చేస్తున్నారంటూ.. క్రికెట్ సెలెక్షన్ కమిటీలపైన మండిపడుతున్నారు నెటిజెన్స్. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ని అండర్-19 జట్టుకు ఎంపిక చేయడం నెటిజెన్స్ తాజా ఆగ్రహానికి కేంద్రబిందువుగా మారింది.
అధికారికంగానో.. ప్రత్యేకించో.. అర్జున్ పై ఎవరు ఎలాంటి ఆరోపణలు చేయనప్పటికీ సోషల్ మీడియాలో నెటిజెన్స్ లేవనెత్తిన చర్చ హాట్ టాపిక్ గా మారింది. అండర్-19 జట్టుకు అర్జున్ ను ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ, మహారాష్ట్ర స్కూల్ క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ ద్వారా వెయ్యికి పైచిలుకు పరుగులు సాధించిన ప్రణవ్ ధన్వాడేను మాత్రం ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని కూడా రూపొందించిన కొంతమంది నెటిజెన్స్, సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆ సందేశాన్ని ఒకసారి పరిశీలిస్తే..
'' అర్జున్.. నీలాగా నా తండ్రికి మాజీ క్రికెటర్ హోదా లేదు. ఆయనో సాధారణ ఆటోడ్రైవర్. నీలాగా సెలెక్టర్లను మేనేజ్ చేయడం కూడా నాకు రాదు. ఎందుకంటే నా కుటుంబానికి, తల్లిదండ్రులకు అంత స్తోమతలేదు. అదీగాక, నీలా నేను అగ్రకులానికి చెందిన వాడిని కూడా కాదు. నాకంటూ ఉన్నది ప్రతిభ మాత్రమే, అందుకే సెలక్షన్ కమిటీకి నేను గుర్తు రాలేదు.' అంటూ ప్రణవ్ ధన్వాడే ఆవేదన చెందుతున్నట్టుగా రూపొందించిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా విస్తరిస్తోంది.
అయితే దీనిపై స్పందించిన ప్రణవ్ ధన్వాడే తండ్రి ప్రశాంత్ ధన్వాడే మాత్రం సోషల్ మీడియాలో వస్తోన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అర్జున్ పై ఇలాంటి ప్రచారం చేయడం సబబు కాదని సూచించారు. ఇంకా అండర్-16 లో కూడా ఆడని తన కుమారుడిని అప్పుడే అండర్-19లోకి ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు.
అర్జున్, ప్రణవ్ ఇద్దరు మంచి మిత్రులని చెప్పుకొచ్చిన ప్రణవ్ తండ్రి.. ఇలాంటి నెగెటివ్ ప్రచారం వాళ్లిద్దరి కెరీర్ ని ఒత్తిడిలోకి నెడుతుందన్నారు. ఇలాంటి ఆరోపణలు ఎంతమాత్రం సరికాదని చెప్పిన ఆయన అర్జున్, ప్రణవ్ ప్రతిరోజు మాట్లాడుకుంటారని ఈ ప్రచారం శ్రుతిమించితే వాళ్లిద్దరిపై ఒత్తిడి
పెరుగుతుందన్నారు.
దీనిపై స్పందించిన వారి కోచ్ కూడా నెటిజన్ల ఆరోపణలను తప్పుబట్టారు. జట్టులో మిగతా 10మందిని వదిలేసి కేవలం అర్జున్ పైనే నెగెటివ్ ప్రచారం చేయడమేంటని నిలదీశారు.