
హైదరాబాద్: ఇటీవలే భారత సెలక్టర్లు ప్రకటించిన అండర్-19 జట్టులో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలో టీమిండియా అండర్-19 జట్టు తరఫున అర్జున్ శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాడు.
ఈ పర్యటనలో భాగంగా అర్జున్ టెండూల్కర్ ఆతిథ్య శ్రీలంక జట్టుతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనున్నాడు. అయితే, ఈ పర్యటనకు ముందు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో శిక్షణ తీసుకుంటున్నాడు. గత శనివారం ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన కోసం కోహ్లీ సేన లండన్కు బయల్దేరిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం లండన్లో ఉంటున్న అర్జున్ టెండూల్కర్ సోమవారం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిని కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. "యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్కు విలువైన సలహాలు, సూచనలు ఇస్తోన్న రవిశాస్త్రి" అని బీసీసీఐ పేర్కొంది.
మరోవైపు ఐర్లాండ్తో మ్యాచ్ల కోసం కోహ్లీసేన నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్లో భాగంగా టీమిండియా బ్యాట్స్మెన్లు కోహ్లీ, ధావన్కు అర్జున్ బౌలింగ్ చేశాడు. జూన్ 27, 29న భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఆ తర్వాత జులై 3నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
అర్జున్ టెండూల్కర్కు రవిశాస్త్రి సూచలను ఇస్తోన్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తన తండ్రి దిగ్గజ క్రికెట్ కావడంతోనే అర్జున్ను బీసీసీఐ బాగా ప్రమోట్ చేస్తోందని జోకులు వేస్తున్నారు.