|
తల్లులందరికీ..
కూతురి కోసం అర్చనా తల్లి సావిత్రి అనేక నిందనలు భరించింది. 'కూతుర్ని ఎవరికో అమ్మేసింది. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది'... భర్త చనిపోయిన సావిత్రి తన కూతుర్ని పొరుగూరి స్కూల్లో చేర్చాక ఊరి ఆడవాళ్ల నుంచి ఎదుర్కొన్న నింద అది. అయినా ఆ తల్లి ఈ మాటలు పట్టించుకోలేదు. 'ఏమైనా సరే నా కూతురు క్రికెట్ ఆడాలి' అనుకుంది. తనకు చేతనైన కష్టం చేసి కూతురి కలలకు అండగా నిలబడింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని గట్టిగా చాటి చెప్పింది.
|
మంత్రగత్తే అని పిలిచినా..
అర్చనా దేవి ఊరు, పొలం గంగానది ఒడ్డునే ఉంటాయి. వరదలతో ఆ పొలం ఏడాదిలో సగం రోజులు మునకలో ఉండేది. మిగిలిన సగం రోజుల్లో తండ్రి శివరామ్ వ్యవసాయం సాగించేవాడు. కానీ ఆయన 2008లోనే కేన్సర్తో మరణించారు. దాంతో ఊళ్లో ఆడవాళ్లందరూ అర్చనా తల్లి సావిత్రిదేవిని నష్ట జాతకురాలిగా పిలిచేవారు. అయినా సావిత్రి భయపడలేదు. ఇద్దరు కొడుకులను, కూతురైన అర్చనను రెక్కల కింద పెట్టుకుని సాకసాగింది. దురదృష్టం... చిన్న కొడుకు బుద్ధిమాన్ కూడా మరణించాడు. దాంతో సావిత్రిని చూస్తే చాలు ఊరు దడుచుకునేది. 'ఇదో మంత్రగత్తె. మొదట భర్తను మింగింది. తర్వాత కొడుకును' అని... ఎదురుపడితే పక్కకు తప్పుకునేవారు. సావిత్రి దేవి ఇంకా రాటు దేలింది. పిల్లల కోసం ఎలాగైనా బతకాలనుకుంది.
|
సోదరుడి ఆఖరి మాటలతో..
అర్చనకు క్రికెట్ పై ఆసక్తి, పట్టు కూడా సోదరుడు బుద్ధిమాన్ వల్ల వచ్చినవే. అతను అర్చనను వెంటబెట్టుకుని పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. తోడుగా అర్చన బ్యాటు ఝళిపించేది. అర్చన టాలెంట్ను బుద్ధిమాన్ వెంటనే గ్రహించాడు. 'నువ్వు క్రికెటర్వి కావాలి' అనేవాడు. అర్చన ఆశలు పెట్టుకుంది కాని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధిమాన్ బంతి కొడితే అది దూరంగా చెత్తలో పడింది. వెళ్లి చేతులతో చెత్తను కదిలిస్తూ ఉంటే పాము కరిచింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుంటే కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్ 'అర్చనను క్రికెట్ మాన్పించవద్దు' అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్ చేయాలని.
|
కుల్దీప్ యాదవ్ చిన్ననాటి కోచ్తో..
ఆటలను ప్రోత్సహించే గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. ఈ స్కూల్ తమ పల్లెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా వెనకడుగు వేయలేదు. చుట్టు పక్కలవారు కూతుర్ని అమ్మేసిందని, తప్పుడు పనుల్లో చేర్పించిందని నిందించినా తట్టుకుంది. బోర్డింగ్ స్కూల్లోని ఒక టీచరు అర్చన ప్రతిభను గమనించి కాన్పూరులో ఉండే టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ చిన్ననాటి కోచ్ కపిల్ పాండే దృష్టికి తీసుకెళ్లింది.
అర్చనా ఆటకు ఫిదా అయిన కపిల్ పాండే.. ఆమె కుటుంబ నేపథ్యం తెలుసుకొని దత్తత తీసుకున్నాడు. అన్నీ తానై అర్చనను ప్రోత్సహించారు. కుల్దీప్ యాదవ్ సైతం ఆమె శిక్షణకు సాయం అందించాడు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత అర్చన దేవి తల్లిని నిందించిన వారే ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకప్పుడు తమ ఇంట నీళ్లు కూడా తాగనివారు.. ఇవాళ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగిందని భోజనం చేస్తున్నారు.