న్యూఢిల్లీ : టెస్టు క్రికెట్ ఇంకా చావలేదని టీమిండియా మాజీ క్రికెటర్, ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. టెస్ట్ క్రికెట్కు ఇంకా ఆదరణ ఉందని, కాకపోతే ప్రేక్షకులు స్టేడియాలకు రాకుండా డిజిటల్ మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటున్నారని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఐసీసీ తీసుకొచ్చిన ఫోర్డే టెస్ట్ ప్రతిపాదనపై స్పందిస్తూ.. వ్యతిరేకించాడు. ఐదు రోజులు ఆడితేనే అది టెస్టు మ్యాచ్ అవుతుందని, నాలుగు రోజుల ఆట కాదని చెప్పారు. స్వచ్ఛమైన టెస్టు క్రికెట్ అంటే ఐదు రోజుల ఆటేనని అభిప్రాయపడ్డారు.
IND vs NZ రెండో టెస్ట్ ప్రివ్యూ : సమం చేస్తారా? లేక సమర్పించుకుంటారా?
2023-2031 సీజన్లో ఐసీసీ.. కచ్చితంగా నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో చాలా మంది మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు దాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ రోహిత్శర్మ కూడా దీన్ని ఖండించారు. అయితే, ఇదే విషయంపై ఐసీసీ క్రికెట్ కమిటీ కొన్నేళ్ల క్రితం ఆలోచన చేసిందని, పలు కారణాల రీత్యా అది ముందుకు జరగలేదని కుంబ్లే తెలిపాడు.
మరోవైపు ఐసీసీ తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన కూడా కచ్చితంగా అమలయ్యేలా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదని కుంబ్లే చెప్పుకొచ్చాడు. అలాగే ఈ ప్రతిపాదనను పలువురు ఆటగాళ్లు వ్యతిరేకించడం తనకు సంతోషం కలిగించిందన్నాడు. సంప్రదాయ క్రికెట్కు ఆదరణ తగ్గితే ఆ విషయంపై దృష్టి సారించాలని, ప్రేక్షకులను స్టేడియాలకు తరలించాలి. కానీ, టెస్టు క్రికెట్కు కాలం చెల్లిందనే వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పుకొచ్చాడు.