అందుకే కేఎల్ రాహుల్ను రిటైన్ చేసుకోలేకపోయాం: అనిల్ కుంబ్లే

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. కొన్ని అనూహ్యాలు... మరికొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు... మొత్తంగా చూస్తే అంచనాలకు అనుగుణంగానే ఈ రిటెన్షన్ ప్రక్రియ సాగింది. సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి. సన్రైజర్స్ హైదరాబాద్తో డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ బంధం ముగియగా, ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను వదిలేసింది.
డుప్లెసిస్కంటే మొయిన్ అలీ వైపే చెన్నై సూపర్ కింగ్స్ మొగ్గు చూపగా, పొలార్డ్లో ఇంకా పవర్ మిగిలి ఉందని ముంబై నమ్మింది. కోల్కతా నైట్రైడర్స్ కూడా గిల్లాంటి కుర్రాడిని కాదని రసెల్లాంటి వెటరన్కే ప్రాధాన్యత ఇచ్చింది. ఇక పంజాబ్ కింగ్స్ కూడా కేఎల్ రాహుల్ను రిటైన్ చేసుకోలేకపోయింది. అయితే దానికి గల కారణాన్ని ఆ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు.

రాహుల్ నిర్ణయాన్ని..
కేఎల్ రాహుల్ వేలంలోకి వెళ్లేందుకు ఇష్టపడటంతోనే రాహుల్ను రిటైన్ చేసుకోలేకపోయామని కుంబ్లే స్పష్టం చేశాడు. రాహుల్ను జట్టులో కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, అతనికి అనుగుణంగానే జట్టును నిర్మిద్దామనుకున్నామని తెలిపాడు. కానీ రాహుల్ మాత్రం వేలంలోకి వెళ్లేందుకే ఇష్టపడ్డాడని, అతని నిర్ణయాన్ని మేం గౌరవించామని చెప్పాడు.
'రాహుల్ను రిటైన్ చేసుకోకపోవడం మాకు సవాల్తో కూడుకున్నదే. వాస్తవానికి అతని కోసం తీవ్రంగా ప్రయత్నించాం. రాహుల్ను జట్టుతో సుదీర్ఘకాలం ఉంచేందుకే రెండేళ్ల క్రితం అతన్ని కెప్టెన్గా ఎంపిక చేశాం. అతనే జట్టులో కోర్ మెంబర్గా భావించాం. కానీ అతను వేలంలోకి వెళ్లేందుకే ఇష్టపడ్డాడు. అతన్ని నిర్ణయాన్ని మేం గౌరవించాం. జట్టులో ఉండాలా? వద్దా? అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం'అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

మయాంక్ ఆ సత్తా ఉంది..
ఇక పంజాబ్ మయాంక్ అగర్వాల్(రూ.12 కోట్ల)తో పాటు అర్షదీప్ సింగ్(రూ.4 కోట్లు)లను మాత్రమే రిటైన్ చేసుకుంది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు నికోలస్ పూరన్, క్రిస్ గేల్లను సైతం వదులుకుంది. అయితే మయాంక్ అగర్వాల్కు జట్టును నడిపించే సత్తా ఉందని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా అతను అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో రాణించాడని తెలిపాడు. 'మయాంక్ అగర్వాల్ గత మూడు, నాలుగేళ్లుగా మాతో(పంజాబ్)నే ఉన్నాడు.
అద్భుత ప్రదర్శన కూడా కనబర్చాడు. గత రెండేళ్లుగా నేను ఈ ఫ్రాంచైజీతో ఉన్నా.. అతను అద్భుతంగా రాణించాడు. జట్టును నడిపించే సామర్థ్యం కూడా అతనికి ఉంది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు'అని కుంబ్లే పేర్కొన్నాడు.

లక్నోకు రాహుల్..
ఇక కేఎల్ రాహుల్తో కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా లక్నో ఫ్రాంచైజీ అతనికి రూ.20 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు నేషనల్ మీడియా వరుస కథనాల్లో పేర్కొంటుంది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్.. లక్నో తమ ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేసిందని ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో డిసెంబర్ 25 వరకు కొత్తగా వచ్చిన జట్లు వేలంలోకి వచ్చిన ఆటగాళ్ల నుంచి ముగ్గురేసి ప్లేయర్లను తీసుకోవచ్చు. ఈ పికప్ ప్రక్రియలో రాహుల్ను తీసుకుంటే.. ప్రచారం జరిగేది వాస్తవమే. లేదంటే రాహుల్ తన సొంత రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఫ్రాంచైజీకి కెప్టెన్గా వెళ్లే చాన్సుంది. ఆర్సీబీ సైతం నలుగురిని కాకుండా ముగ్గురినే రిటైన్ చేసుకుంది. దాంతో రాహుల్ కోసం ఆర్సీబీ ప్రయత్నిస్తుందా? అనే సందేహం కలుగుతోంది.

పంజాబ్ రిటెన్షన్ లిస్ట్..
1. మయాంక్ అగర్వాల్ (రూ. 12 కోట్లు)
2. అర్ష్దీప్ సింగ్ (అన్క్యాప్డ్ - రూ. 4 కోట్లు)
ఇటీవల డిమాండ్ పెరిగిన తమిళనాడు ప్లేయర్ షారుఖ్ ఖాన్ కూడా వేలంలో వెళ్లేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. అయితే వేలంలో ఇంత భారీ విలువ దక్కే అవకాశం లేని మయాంక్ను రూ. 12 కోట్లకు తీసుకోవడం అతనికి లభించిన జాక్పాట్. గత సీజన్లో ఆకట్టుకున్న అర్ష్దీప్ను స్థానిక ఆటగాడిగా కొనసాగించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications