హైదరాబాద్: బీసీసీఐకి ఇది ఊహించని ఎదురుదెబ్బ. రాష్ట్ర సంఘాలు కోరినట్టుగా జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను సవరించేందుకు కోర్టు సహాయకుడు గోపాల్ సుబ్రమణియమ్ అంగీకరించలేదు. లోధా కమిటీ సిఫార్సుల్లో చాలా వాటిని యథాతథంగా బీసీసీఐ ముసాయిదా రాజ్యాంగంలో చేర్చాలని సూచించాడు.
కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) నిర్ణయం బీసీసీఐకి ఏ మాత్రం మింగుడుపడటం లేదు. బోర్డు ప్రక్షాళన, పారదర్శకత కోసం జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రధాన సిఫార్సుల్ని అమలు చేయాల్సిందేనని అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్ సుప్రీం కోర్టుకు నివేదించారు.
ఒక్కటి మినహా మిగతా సిఫార్సుల్ని బీసీసీఐ నియమావళిలో చేర్చాల్సిందేనని అందులో పేర్కొన్నారు. ఆ ఒక్కటీ ఏంటంటే సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యుల ప్యానెల్ను ముగ్గురితో కుదించకుండా కొనసాగవచ్చని కోర్టుకు సూచించాడు.
అంతేకాదు సభ్యులకు కచ్చితంగా టెస్టు అనుభవం ఉండాల్సిన అవసరం లేదని, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉంటే సరిపోతుందని పేర్కొన్నాడు. లోథా కమిటీ సిఫార్సులపై రాష్ట్ర సంఘాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సుప్రీం కోర్టు గోపాల్ సుబ్రమణియమ్ను నియమించింది.
దీంతో పాటు మిగతా ఐదు ప్రధాన సిఫార్సులైన ఒక రాష్ట్రం-ఒక ఓటు, గరిష్టంగా పదవుల్లో కొనసాగే కాలం 18 ఏళ్లు (9+9), పదవుల మధ్య మూడేళ్ల విరామం, 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, ఎన్నికైన సభ్యులు (ఆఫీస్ బేరర్లు), సీఈఓ (ప్రొఫెషనల్స్)ల మధ్య అధికార పంపకాలులాంటివి అమలు చేయాలని సుబ్రమణియమ్ నివేదిక సమర్పించారు.
అయితే చాలా వరకూ రాష్ట్ర సంఘాలు ఒక రాష్ట్రం-ఒక ఓటు, 18 ఏళ్ల పదవీకాలం, ప్రతి మూడేళ్లకోసారి పదవుల నుంచి తప్పించడం, 70 ఏళ్లలోపు వారికి మాత్రమే అర్హత కల్పించడం విషయాలపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దీనిపై సుప్రీం కోర్టు జూలై 4న జరిగే విచారణలో తీర్పు ఇచ్చే అవకాశముంది.