ఇస్లామాబాద్: అనూహ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ఫైనల్ దాకా చేరుకోవడంలో అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. దీని వెనుక ఫిక్సింగ్ జరిగి ఉండవచ్చునని బాంబు పేల్చారు.
ఆదివారం నాడు భారత్తో పాక్ అమీతుమీకి సిద్దమవుతున్నన నేపథ్యంలో.. పాక్ జట్టు స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పాక్ ఆటగాళ్లు ఏమాత్రం పసలేనివారు అన్న తరహాలో కామెంట్స్ చేసిన ఆయన.. ప్రత్యర్థులకు భారీగా డబ్బు ముట్టజెప్పడం ద్వారానే వారు ఛాంపియన్స్ ట్రోఫీలో విజయాలు నమోదు చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఫిక్సర్ల సహాయంతో పాక్ ఈ చర్యకు పాల్పడి ఉంటుందని ఆరోపించారు.
భారత్-పాక్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడేలా ఇంగ్లండ్ జట్టుతో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని అమీర్ ఆరోపిస్తున్నారు. ఇందుకోసం టోర్నీ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ మొత్తాన్ని పాకిస్తాన్.. ఇంగ్లాండ్ కు ఆఫర్ చేసిందన్నారు. ఇందులో పాక్ బడా వ్యాపారుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
కేవలం జట్టునే కాకుండా ఆటగాళ్ల పేర్లు సైతం పేర్కొంటూ అమీర్ సోహైల్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం గమనార్హం. ఆటతో కాకుండా ఫిక్సింగ్ ద్వారా నెగ్గేందుకు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రయత్నించాడని సంచలన ఆరోపణలు చేశాడు. మైదానంలో సర్ఫరాజ్ ఏమాత్రం రాణించలేదని, ఫిక్సింగ్ లో అతని పాత్ర కచ్చితంగా ఉంటుందని అన్నారు. ఉత్తమ ప్రదర్శనతో పాక్ ఫైనల్ వెళ్లలేదని కేవలం ఇతరత్రా కారణాల వల్లే ఆ జట్టు తుది దాకా చేరుకుందని అభిప్రాయపడ్డారు.
ఏదేమైనా ఛాంపియన్ప్ ట్రోఫీ ఫైనల్ కు పాక్ సిద్దమైన సమయంలో.. అమీర్ సోహైల్ ఇలాంటి సంచలన ఆరోపణలు చేయడం.. ఆ జట్టు స్థైర్యాన్ని దెబ్బతీసేదిగా మారింది. ఈ వ్యాఖ్యలు ఆదివారం జరిగే ఫైనల్లో పాక్పై ప్రభావం చూపించే అవకాశముంది.ఇదిలా ఉంటే, అమీర్ సోహైల్ గతంలో పాక్ ఓపెనర్ గాను, ఆ తర్వాత పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ గాను బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.