అబుదాబి: అబుదాబి వేదికగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన లీగ్ మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. తొలి మ్యాచ్లోనే తెలుగు తేజం అంబటి రాయుడు మంచి ఇన్నింగ్స్తో విమర్శకుల నోళ్లు మూయించాడు. లక్ష్య చేదనలో ఏమాత్రం తడబడకుండా తనదైన శైలిలో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. రాయుడు తన ఇన్నింగ్స్లో మొత్తం 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. దీంతో స్టార్ ప్లేయర్ సురేష్ రైనా లేని లోటును చెన్నై జట్టుకు భర్తీ చేశాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తర్వాత అంబటి రాయుడు మాట్లాడుతూ... 'ఐపీఎల్ ప్రారంభానికి చాలా రోజుల ముందే అందరం చెన్నైలో ప్రాక్టీస్ చేశాం. తర్వాత లాక్డౌన్లోనూ నా ప్రాక్టీస్ కొనసాగింది. దుబాయ్లో కూడా సాధన చేశాం. అవన్నీ నాకు ఎంతగానో ఉపయోగపడింది. నా సక్సెస్ వెనుక ఉన్న అసలు కారణం అదే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దాటిగా ఆడాలని ముందు అనుకోలేదు. పిచ్ పరిస్థితి ఏంటనేది అంచనా వేసుకున్నాక బ్యాట్ ఝూలిపించాను. మొదట ఒక పది బంతులను సమర్థంగా ఎదుర్కొన్నా. తర్వాత పిచ్ అనుకూలంగా మారడంతో పరుగులు వాటంతట అవే వచ్చాయి. సురేష్ రైనా లేని లోటును పూడ్చాల్సిన అవసరం ఏర్పడింది' అని తెలిపాడు.
లక్ష్య ఛేదనలో 2 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్ 2 వికెట్లకు 6 పరుగులు.ఈ సమయంలో అంబటి రాయుడు బ్యాటింగ్కు వచ్చాడు. ప్యాటిన్సన్ బౌలింగ్లో బ్యాక్ఫుట్పై కొట్టిన ఫోర్తో రాయుడు జోరు మొదలైంది. బౌల్ట్ ఓవర్లో కొట్టిన కవర్ డ్రైవ్ బౌండరీ అయితే చూడముచ్చటగా అనిపించింది. ముంబై బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. ఇక బుమ్రా వేసిన వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ (ఫ్రీ హిట్) కొట్టిన రాయుడు జోరు పెంచాడు. కృనాల్ బౌలింగ్లో మరో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం రాయుడు... బుమ్రా ఓవర్లో కొట్టిన అద్భుతమైన స్ట్రెయిట్ బౌండరీతో 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా కొన్ని మంచి షాట్లతో అలరించిన రాయుడు.. చెన్నైకి గెలుపు బాట చూపించి రాహుల్ బౌలింగ్లో వెనుదిరిగాడు.
2019 ప్రపంచకప్లో ఆడే అవకాశం అంబటి రాయుడు వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆల్రౌండర్ (3డీ) అనే కారణంతో విజయ్ శంకర్కు జట్టులో స్థానం దక్కింది. ఆ తర్వాత విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో దూరమైనా.. రాయుడికి జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన రాయుడు.. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే రాయుడుకి ప్రపంచకప్లో చోటు దక్కించుకోకపోవడానికి అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాదే కారణమని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ తొలి మ్యాచ్లో రాయుడు అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో మరోసారి ఎమ్మెస్కేను ఫాన్స్ టార్గెట్ చేశారు. 'ఎమ్మెస్కే ప్రసాద్.. 3డి గ్లాసులతో అంబటి రాయుడుని చూడండి' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. '2019 ప్రపంచకప్లో ఎందుకు రాయుడికి చోటివ్వలేదో కెప్టెన్ విరాట్ కోహ్లీ సమాధానం చెప్పాలి' అని మరో అభిమాని ప్రశ్నించాడు.
ఆర్చర్ సిద్ధంగా ఉండు.. నువ్వోనేనో తేల్చుకుందాం: వార్నర్