టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదు
అంబటి రాయుడు బ్యాటింగ్ తీరుపై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అయితే రాయుడు మళ్లీ టీమిండియాకు ఆడినా ఆశ్చర్యం లేదన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేసిన ఓ వీడియోలో బ్రాడ్ హాగ్ మాట్లాడుతూ... 'సీఎస్కే లోతైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అంబటి రాయుడు బాగా ఆడుతున్నాడు. కీలక సమయంలో ఒత్తిడి లేకుండా బాగా బ్యాటింగ్ చేశాడు. త్వరలోనే అతడు భారత జట్టులోకి తిరిగి వచ్చినా ఆశ్చర్యపోను. అతడికి ఇది మంచి టోర్నీ అవుతుందనుకుంటున్నా. రాయుడు అత్యున్నతంగా కనిపిస్తున్నాడు' అని తెలిపాడు.
33 బంతుల్లోనే అర్ధ సెంచరీ
ముంబైతో జరిగిన మ్యాచ్లో 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయ్, షేన్ వాట్సన్లు తక్కువ పరుగులకే వెనుతిరిగారు. ఈ దశలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అంబటి రాయుడు. జేమ్స్ ప్యాటిన్సన్ బౌలింగ్లో బ్యాక్ఫుట్పై కొట్టిన ఫోర్తో రాయుడు జోరు మొదలైంది.
ట్రెంట్ బౌల్ట్ ఓవర్లో కొట్టిన కవర్ డ్రైవ్ బౌండరీ అయితే చూడముచ్చటగా అనిపించింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ (ఫ్రీ హిట్) కొట్టిన రాయుడు జోరు పెంచాడు. కృనాల్ బౌలింగ్లో మరో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం.. బుమ్రా ఓవర్లో కొట్టిన అద్భుతమైన స్ట్రెయిట్ బౌండరీతో 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో హాఫ్ చేసిన పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రాయుడు నిలిచాడు. ఆ తర్వాత కూడా కొన్ని మంచి షాట్లతో అలరించిన రాయుడు చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తొడ కండరాలు పట్టేయడంతో
గాయం కారణంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అంబటి రాయుడు బరిలోకి దిగలేదు. తొడ కండరాలు పట్టేయడంతో మరో ఒకటి లేదా రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడని సమాచారం. ప్రస్తుతం రాయుడు గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే ముందస్తు జాగ్రత్తగా మరో ఒకటి లేదా రెండు మ్యాచ్లకు విశ్రాంతిని ఇస్తారట. రాయుడు భారత్ తరఫున 55 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. ఇక 148 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు.
2018 సీజన్లో 602 పరుగులు
2018 ఐపీఎల్ సీజన్లో అంబటి రాయుడు 602 పరుగులు సాధించి చెన్నై విజేతగా నిలవటంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే 2019 ప్రపంచకప్లో ఆడే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆల్రౌండర్ (3డీ) అనే కారణంతో విజయ్ శంకర్కు జట్టులో స్థానం దక్కింది. ఆ తర్వాత విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో దూరమైనా.. రాయుడికి జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన తెలుగు తేజం క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.